అర్లి (టి) 4.9
-మళ్లీ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
-చలితో పాటు చల్లగాలులతో మరిన్ని ఇబ్బందులు
-రెండు రోజులు మరింత జాగ్రత్త ఉండాలన్న వాతావరణ శాఖ

రాష్ట్రం చలితో గజగజ వణుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు ఒక్కసారిగా పడిపోయాయి. పలుచోట్ల ఉదయం 8 వరకు మంచు కురుస్తోంది. అడుగు దూరంలో ఉన్నవాళ్లు కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు పడుతోంది. రాత్రి పూట సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతలు తగ్గాయి. సాయంత్రం ఐదింటి నుంచే చలి మొదలవుతోంది. ఉదయం 9 దాటినా సూర్యుడు కనిపించడం లేదు. చలి గాలుల వల్ల ప్రజలు కాలు బయట పెట్టాలంటేనే వణుకుతున్నారు. చలి తీవ్రత మరో రెండు రోజులు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తుండటంతో.. రాత్రి ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గాయి. వాస్తవానికి ఈ సమయంలో చలి తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాధారణ ఉష్ణోగ్రతలు చాలా మేరకు తగ్గాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు అన్ని చోట్ల అదే పరిస్థితి నెలకొంది. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 4.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక కొమురంభీమ్ జిల్లా సిర్పూరు(యు) 5.8, గిన్నెధరి (6.0), రంగారెడ్డి జిల్లా మీర్కంపేట్లో 6.3, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 6.4, నిర్మల్ జిల్లా పెంబిలో 6.6, ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ధరిలో 6.5, జైనథ్ 6.7, ఆదిలాబాద్ అర్బన్లో 7.0, తాంసిలో 7.1 ఉష్ణోగ్రలు నమోదయ్యాయి.
రెండు రోజులు జర భద్రం
తెలంగాణ రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయని తెలిపింది. ఈ ప్రభావం తెలంగాణలోని ఉత్తర, మధ్య జిల్లాలతో పాటు హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ రెండు రోజుల పాటు చలి రికార్డు స్థాయిలో నమోదు అవుతుందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.