వెయ్యి కోట్లు టార్గెట్..
- జిల్లాల వారీగా ప్లాట్ల వేలం
- ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్

మంచిర్యాల : ప్రభుత్వం వెయ్యి కోట్ల ఆదాయం కోసం ప్రణాళికలు రూపొందించి వాటిన అమలు చేస్తోంది. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్లోనే ప్లాట్లు, భూముల అమ్మకాలు చేపట్టిన ప్రభుత్వం మొదటిసారిగా జిల్లాల్లోనూ ప్లాట్లు విక్రయించేందుకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మార్చి 14, 15, 16, 17 తేదీల్లో వేలం వేయనున్నారు. తొమ్మిది జిల్లాలో ఉన్న ప్లాట్లను వేలం వేస్తారు. ఆన్లైన్లో కాకుండా జిల్లాల వారీగా బహిరంగ వేలంలో విక్రయించనున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని 2 ప్రాంతాల్లో, మహబూబ్నగర్, నల్లగొండ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మొత్తం 1,408 ప్లాట్లను విక్రయించనున్నారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు తమ ప్రాంతంలో అభివృద్ధి చేసే లే అవుట్ల వివరాలను ప్రకటించారు. స్థానికంగా ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ధరను నిర్ణయించారు. రాష్ట్రంలో అత్యల్పంగా ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో చదరపు గజానికి కనీస ధరను రూ.5 వేలు నిర్ణయించగా, రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లిలో అత్యధికంగా చ.గజానికి రూ.40 వేలుగా నిర్ణయించారు.
వేలంలో పాల్గొనే వారు డిపాజిట్ కింద రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన వారికే వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఈ-వేలం కాకుండా బహిరంగంగా ప్రత్యక్ష పద్ధతిలో జిల్లా కేంద్రాల్లో వేలం సాగనుంది.. కనీస ధరకు మించి చదరపు గజానికి వెయ్యి చొప్పున వేలం వేయాల్సి ఉంటుంది. అత్యధిక ధర నిర్ణయించిన వారికి ప్లాట్ దక్కనుంది.