ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెల్లడి

మంచిర్యాల : ఎస్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. భీమారం మండలం బూరుగుపల్లిలో లంబాడీల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ 283 వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. ఎస్టీల రిజర్వేషన్ బిల్లును మోడీ ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదో బిజెపి నాయకులు తెలపాలని ప్రశ్నించారు. అనంతరం ఆయన గ్రామంలోని పలు సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో త్వరలోనే 33/11 KV సబ్స్టేషన్ పనులు ప్రారంభిస్తామన్నారు. ఏడాదిలోపు భీమారం మండలంలోని 11 గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైన్స్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భీమారం మండలంలో అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ ద్వారా నర్సక్కపేట లిఫ్ట్ ద్వారా నీళ్లును మండలంలోని అన్ని చెరువులు నింపి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో వ్యవసాయ పరంగా మౌలిక వసతుల పరంగా అద్భుతమైన మండలంగా దీన్ని తీర్చి దిద్దుతామన్నారు. తాను పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలోనే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి భీమారం మండలం ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామంలోని సేవాలాల్ ఆలయ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల వ్యక్తిగత నిధులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, జడ్పీటీసీ భూక్యా తిరుమల నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు కలగూర రాజ్కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
.