‘అమ్మ’ అస్తమయం

మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి,మహిళా జె ఏ సి లో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు. ఆమె 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. అప్పట్లో ఉద్యమంలో, ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ అకాలమరణం చెందారు.
ఉస్మానియాలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో మెస్ లు కూడా మూసేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన సమైక్య పాలకులకు ఆ విద్యార్థుల ఆకలి తీర్చి ధీటైన సమాధానం చెప్పింది. ఎందరో విద్యార్థులకు ఆకలి తీర్చిన అమ్మ.. అమ్మ ల సంఘం అధ్యక్షురాలిగా నేటికీ కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం స్థాపించి ఉద్యమాన్ని ఉరకలెత్తించి, నమస్తే తెలంగాణ సంపాదకులుగా పనిచేసి, ప్రస్తుతం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కొనసాగుతున్న అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మక్క. ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం ఎర్రగడ్డ జేక్ కాలనీ లోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ రోడ్ నెంబర్ 1 వద్ద ఉంచుతారు. అప్పటివరకు మృతదేహం నిమ్స్ ఆసుపత్రి లో ఉంటుంది. రేపు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం లో మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి.
కేసీఆర్ సంతాపం…
తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ సేవలను సిఎం ఈ సందర్భంగా యాది చేసుకున్నారు. అల్లం నారాయణను ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.