తిరిగొచ్చిన విద్యార్థులకు ఊరట…

ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా వెనక్కి వచ్చేసిన వైద్య విద్యార్థులకు భారత ప్రభుత్వం ఊరట కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వారి విద్యాభ్యాసం మధ్యలో ఆగిపోకుండా పూర్తి చేసే ప్రత్యామ్నాయ అవకాశాల దిశగా కృషి చేస్తోంది.
ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని వేలమంది వైద్య విద్య చదువుతున్న విద్యార్థులు భారత్ లోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు. వారు ప్రాణాలతో బయటపడి వచ్చినా… అక్కడ నెలకొన్న సంక్షోభం కారణంగా మెడిసిన్ చదువు మధ్యలో ఆగిపోతుందనే ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులల్లో వ్యక్తమవుతుంది.
ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు సడలించడం లేదా భారత్, ఇతర దేశాల్లో మెడికల్ విద్యను పూర్తిచేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జాతీయ మెడికల్ కమిషన్-2021 నిబంధనల ప్రకారం, విదేశాల్లో మెడిసిన్ చదివే విద్యార్థులు కోర్సు, శిక్షణ, ఇంటర్న్షిప్ కూడా అక్కడే పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రాథమికంగా వైద్యవిద్య ఎక్కడ అవుతుందో మిగతావీ కూడా అక్కడే పూర్తి చేయాలి. మెడిసిన్ మధ్యలో స్వదేశానికి వచ్చి ఇక్కడ కోర్సు పూర్తి చేసేందుకు ప్రస్తుత నిబంధనలు అనుకూలించవు.
అయితే, ఉక్రెయిన్ లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడ మెడిసిన్ చదువుతున్న భారతీయ విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా నిబంధనలు సడలించే అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. భారత్ లోని ప్రైవేట్ కాలేజీలో కోర్సు పూర్తి చేయడం/విదేశాల్లోని కాలేజీలకు బదిలీ చేసుకునే వీలు కల్పించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఆరోగ్య శాఖ, జాతీయ మెడికల్ కమిషన్, ఆరోగ్య శాఖ, విదేశాంగ శాఖతో పాటు నీతి ఆయోగ్ త్వరలోనే అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో కోర్సు పూర్తయ్యేందుకు వెసులుబాటు కలిగించే అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.
ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ కోర్సు వ్యవధి ఆరు సంవత్సరాలు. రెండేళ్లు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలా వైద్య కళాశాలలు ఇంటర్షిప్ కూడా రెగ్యులర్ వైద్య విద్యతో పూర్తి చేస్తున్నాయి. భారత్ లోని ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పోలిస్తే ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ కోర్సుకు అయ్యే ఖర్చు చాలా తక్కువే. అందుకే ప్రతి ఏటా వేలమంది మెడిసిన్ ఔత్సాహికులు భారత్ నుంచి ఉక్రెయిన్ కు తరలివెల్తుంటారు. యుద్ధం నేపథ్యంలో తాము వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి తమకు ఇక్కడే పరీక్ష రాసే అవకాశం కల్పించాలని మంచిర్యాల జిల్లా మాదారం టౌన్షిప్కు చెందిన మందనపు స్ఫూర్తి కోరారు. తాను అక్కడ ఐదో సంవత్సరం చదువుతున్నానని మిగతావి ఇక్కడే చదువుకునేలా నిబంధనలు సడలించానలి స్ఫూర్తి విజ్ఞప్తి చేశారు.