కోడిపుంజును బలిద్దామని.. భర్తనే బలిచ్చింది..
-ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన ఇల్లాలు
-మూడ్నెళ్ల తరువాత వీడిన మిస్టరీ

దేవతకు కోడిపుంజు బలిస్తే మన ఇంట్లో గొడవలు తగ్గుతాయి.. ఒంటరిగా గుడికి వెళ్లిరా.. అని భర్తను నమ్మించిన ఓ ఇల్లాలు ఏకంగా భర్తనే మర్డర్ చేయించింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… వనపర్తి జిల్లా గాంధీనగర్కు చెందిన మేస్త్రీ బాలస్వామికి లావణ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. అదే జిల్లా మదనాపురం మండలం దంతనూర్కు చెందిన నవీన్ అనే యువకుడికి లావణ్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనిపై భార్యభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి.
ఐదు నెలల క్రితం పొలం విక్రయించగా బాలస్వామికి ఐదు లక్షలు వచ్చాయి. ఆ సొమ్మును తీసుకొని ప్రియుడితో పారిపోదామని లావణ్య ప్రయత్నించింది. కానీ మళ్లీ భర్త ఇబ్బంది పెడతాడని భావించి.. ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నింది. మన మధ్య ఘర్షణలు తగ్గిపోవాలంటే వనపర్తి శివారులోని జెర్రిపోతుల మైసమ్మ గుడి వద్ద అర్థరాత్రి కోడిపుంజును బలిస్తే మంచి జరుగుతుందని, ఇంట్లో గొడవలు తగ్గుతాయని భర్తను లావణ్య నమ్మించింది. దీంతో కోడి పుంజుతో ఆలయానికి బాలస్వామి ఒక్కడే వెళ్లాడు. ప్లాన్ ప్రకారం ప్రియుడు నవీన్, సుఫారీ గ్యాంగ్ కురుమూర్తి, గణశ్ లు కలిసి బాలస్వామిని హత్యచేశారు.
మరుసటి రోజు తన అన్న కనిపించడం లేదని బాలస్వామి తమ్ముడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో లావణ్య కూడా కనిపించక పోవటంతో అనుమానం వచ్చిన పోలీసులు నవీన్, లావణ్య విషయం తెలుసుకొని వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరితో పాటు హత్యలో భాగస్వాములుగా ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా బాలాపూర్ శివారులో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు తెలపడంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం చేయించారు.