పోలీసుల దాడుల్లో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
-బెల్లంపల్లి డివిజన్లో మూడు చోట్ల దాడులు
-1.08 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం
మంచిర్యాల : బెల్లంపల్లి డివిజన్లో మూడు చోట్ల దాడులు చేసి నకిలీ విత్తనాలు పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జంకాపూర్ లో పక్కా సమాచారం చేసిన దాడిలో బొరిగాం వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో 50 కిలోల పత్తి విత్తనాలు లభించాయి. నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్టు చేసినట్లు కన్నెపల్లి ఎస్ఐ సురేష్ వెల్లడించారు.
భీమిని పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న గుడి పేట్ లో కొమురం మధునయ్య అనే వ్యక్తి వ్యవసాయ భూమి లో దాచి ఉంచిన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ 11 కిలోలు దొరికాయి. ఇక మధునయ్య ఇచ్చిన సమాచారం మేరకు రాజారాo గ్రామం కి చెందిన తొర్రం శంకర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అతని వద్ద 50 కిలోల పత్తి విత్తనాలు దొరికినట్లు భీమిని ఎస్సై వెంకటేష్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నకిలీ విత్తనాలు, ఇద్దరు నిందితులను పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అచులాపూర్లో మోటార్ సైకిల్పై వస్తున్న జాడి వెంకటేష్ అనే వ్యక్తిని తనిఖీ చేయగా ఏడు కిలోల పత్తి విత్తనాలు లభించాయి. తనకు తాండూరుకు చెందిన రాచర్ల మహేష్ అమ్మినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాచర్ల మహేష్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. జాడి వెంకటేష్ ను అరెస్టు చేయడంతో పాటు అతని వద్ద ఉన్న హీరో హోండా ప్యాషన్, 7 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్సై లు మధుసూదన్, లచ్చన, సిబ్బంది తిరుపతి, శ్రీధర్, శ్రీనివాస్ రాకేష్ పాల్గొన్నారు.