ఆసిఫాబాద్ కలెక్టర్ వంతు..
-రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
-ఈసారి రూటు మార్చిన మోసగాళ్లు
-అమెజాన్ గిఫ్ట్ కార్డుల పేరుతో మెసేజ్లు

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా కలెక్టర్ల పేరుతో నేరాలకు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటోతో డబ్బులు కావాలంటూ మేసేజ్ల పంపిన ఘటన మరువకముందే మరో కలెక్టర్ పేరుతో మేనేజ్ లు పంపించారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సైబర్ మోసగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ పేరుతో కొందరికి మేసేజ్లు పంపించారు. రాహుల్ రాజ్ ఫొటో డీపీ పెట్టుకుని జిల్లా అధికారులకు వాట్సప్ మెసేజ్లు పంపించారు. అయితే ఈసారి మోసగాళ్లు తమ రూటు మార్చారు. నేరుగా డబ్బులు అడగకుండా అమెజాన్ గిప్ట్ కార్డుల పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించారు. పలువురు అధికారులకు మెసేజ్లు వెళ్లాయి.
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటోతో (డీపీ) పెట్టి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. 7234822110 నెంబర్కి డిపి కలెక్టర్ ఫొటో పెట్టి అధికారులకు వైద్యులకు డబ్బులు కావాలంటూ వాట్సాప్ మెసేజ్ లు పంపించారు. తనకు అర్జంట్ గా డబ్బులు అవసరం ఉందని వెంటనే డబ్బులు పంపాలని మెసేజ్ పంపించారు. దీంతో ఒక వైద్యుడు నెంబర్కి రూ.30 వేలు పంపించారు. దీనిపై కలెక్టర్ సిక్తాపట్నాయక్ స్పందించారు. అటువంటి చాటింగ్లకు, కాల్లకు ప్రతిస్పందించవద్దని కలెక్టర్ పేషి నుంచి అధికారులకు విజ్ఞప్తి మెసేజ్ పంపించారు.
తాజాగా, కొమురం భీమ్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ పేరుతో మెసేజ్లు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పోలీసులు సైతం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.