ఎస్ఐ, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్
మా ప్రభుత్వం చెప్పింది చేసితీరుతుంది : విప్ బాల్క సుమన్

రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. పోలీస్ ఉద్యోగాల ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 16 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు వెబ్ సైట్లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచారు. మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పోలీస్ శాఖకు సంబంధించి 16,614 ఖాళీల భర్తీకి ఇటీవల ఆర్థికశాఖ అనుమతులు జారీ చేసింది.
పోస్టుల వారీగా వివరాలు ఇవే..
మొత్తం 16,027 కానిస్టేబుల్, 587 ఎస్ఐ పోస్టులు భర్తీ చేయనున్నారు. 4,965 సివిల్ కానిస్టేబుల్, 4,423 ఏఆర్ కానిస్టేబుల్, 5,010 టీఎస్ఎస్పీ కానిస్టేబుల్, 587 ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 414 సివిల్ ఎస్సైల పోస్టులను భర్తీ చేయనుంది. 66 ఏఆర్ ఎస్సై పోస్టులు, 5 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ కానున్నాయి. 23 టీఎస్ఎస్పీ సబ్ ఇన్స్పెక్టర్, 12 ఎస్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్, 26 విపత్తు, అగ్నిమాపకశాఖలో ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. 8 డిప్యూటీ జైలర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
నిరుద్యోగులకు ఆల్ ది బెస్ట్
రాష్ట్రంలో ఉద్యోగ జాతర మొదలయ్యిందని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎం ఎల్ ఏ బాల్క సుమన్ స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి కొలువు సాదించాలని యువతకు పిలుపునిచ్చారు. యువత బీజేపీ మాయలో పడొద్దన్నారు. ఉద్యోగార్థులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీచేయడంలేదని ప్రశ్నించారు. వేలాది పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు బాల్క సుమన్