కార్మిక సంఘాల బాయిబాట‌..

సింగ‌రేణిలో ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉండ‌టంతో ఆయా కార్మిక సంఘాలు బాయి బాట ప‌ట్టాయి. అన్ని కార్మిక సంఘాలు కార్మికుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఐఎన్‌టీయూసీ,బీఎంఎస్‌,ఏఐటీయూసీ కార్మికుల వ‌ద్ద‌కు వెళ్ల‌గా, మిగ‌తా యూనియ‌న్లు సైతం కార్మికుల వ‌ద్ద‌కు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి.

సింగ‌రేణిలో ఎన్నిక‌లవేడి రాజుకుంటోంది. ఇప్ప‌టికే కార్మిక సంఘాలు బావుల్లో కార్మికుల మ‌న‌సు చూర‌గొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. వివిధ ర‌కాలుగా ప్ర‌చారాల ద్వారా కార్మికుల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఎన్నిక‌లు ఎప్పుడో ఇంకా తెలియ‌క‌పోయినా కార్మిక సంఘాలు మాత్రం పూర్తిగా అప్ర‌మ‌త్తం అయ్యాయి. ఏ క్ష‌ణ‌మైనా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉండ‌టంతో ముందుగానే కార్మిక‌క్షేత్రంలో అడుగుపెట్టాయి. త‌మ హ‌యాంలో జ‌రిగిన హ‌క్కుల సాధ‌న‌, పోరాటాలు ఇలా అన్ని ర‌కాలుగా కార్మికుల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నంలో ప‌డ్డాయి. వాస్త‌వానికి ఆయా ఏరియాల్లో నాయ‌కులు ముందుగానే త‌మ ప‌రిధిలో ఉన్న బొగ్గు గ‌నులు, ఓపెన్‌కాస్టులు, డిపార్ట్‌మెంట్ల‌లో ఎప్పుడో ప్ర‌చారం చేశారు. త‌మ వంతుగా కార్మికుల‌ను విస్తృతంగా క‌లిశారు.

ముందుగా ఐఎన్‌టీయూసీ బావుల్లో ప్ర‌చారం కొన‌సాగించింది. సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర పేరిట ఆ యూనియ‌న్ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ గ‌నుల్లో ప్ర‌చారం నిర్వ‌హించారు. గోలేటీ నుంచి మొద‌లు పెట్టి కొత్త‌గూడెం వ‌ర‌కు ఈ యాత్ర కొన‌సాగింది. కేంద్ర,రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెండూ సింగ‌రేణికి ద్రోహం చేస్తున్నాయ‌ని ప్ర‌చారంలో ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ఐఎన్‌టీయూసీ ద్వారా కార్మికుల హ‌క్కులు సాధించుకుందామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌,బీజేపీ వైఖ‌రి ఆయ‌న ఎండ‌గ‌ట్టారు. ముఖ్యంగా సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ‌, బొగ్గు బ్లాకుల విష‌యంలో ప్ర‌ధాన అంశాలుగా కార్మికుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

బీఎంఎస్ సైతం కార్మిక చైతన్య యాత్ర పేరిట కార్మికుల్లోకి వెళ్లింది. యాత్రలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ ఆయా కార్మిక సంఘాల నేత‌లు పాల్గొన్నారు. కోల్ బ్లాక్‌ల వేలంతో స‌హా, కేంద్ర ప్ర‌భుత్వంపై టీఆర్ఎస్ చేస్తున్న ఆరోప‌ణ‌లు తిప్పికొట్టారు. ద‌మ్ముంటే నిజాలు నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు. అంతేకాకుండా, సింగ‌రేణి విష‌యంలో ముఖ్యమంత్రి ఏ రోజు కూడా కేంద్రంతో మాట్లాడ‌లేద‌ని ఒక‌వేళ అలా నిరూపిస్తే తాను ముక్కు నేల‌కు రాసుకుంటా అని ఈటెల స‌వాల్ విసిరారు. సింగ‌రేణిలో రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా 51 ఉంద‌ని, కేంద్రానికి 49 శాతం ఉంద‌ని, రాష్ట్రం అనుమ‌తి లేకుండా ప్రైవేటీక‌ర‌ణ సాధ్యం కాద‌ని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోప‌ణ‌లు కొట్టి ప‌డేశారు.

మ‌రోవైపు బీఎంఎస్ నిర్వ‌హించే కార్మిక చైతన్య యాత్రను తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘ నేత‌లు అడ్డుకున్నారు. ఇది కాస్తా వివాద‌స్ప‌దంగా మారింది. సింగ‌రేణి చ‌రిత్ర‌లోనే ఇలా ఒక సంఘానికి చెందిన నేత‌ల‌ను మ‌రో సంఘం అడ్డుకున్న దాఖ‌లాలు లేవు. ఎవ‌రి ప్ర‌చారం వారు చేసుకుంటారు. ఎవ‌రి అభిప్రాయాలు వాళ్లు వ్య‌క్తం చేస్తారు. మ‌రి త‌మ ప్ర‌చారం అడ్డుకోవ‌డం ఏమిట‌ని బీఎంఎస్ నేత‌లు ప్ర‌శ్నించారు. ఒక‌వేళ తాము చెప్పింది న‌చ్చ‌క‌పోతే కార్మికులే రిజెక్ట్ చేస్తారు క‌దా..? మ‌రి త‌మ‌ను అడ్డుకోవ‌డం కేవ‌లం కుట్ర మాత్ర‌మేన‌ని, త‌మ‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి ఓర్వ‌లేక టీబీజీకేఎస్ ఇలా ప్ర‌వ‌రిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఇప్పుడు ఏఐటీయూసీ జీపుజాత పేరుతో గ‌నుల పైకి వెళ్తోంది. ఆ యూనియ‌న్ సైతం కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రిపై దుమ్మెత్తిపోస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం అంచుల వ‌ర‌కు వెల్లింది. ఈసారి మాత్రం అలా కాకుండా, చాలా ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లో గెలుపుబాట ప‌ట్టేలా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఈ మేర‌కు కార్మికుల్లో అవ‌గాహ‌న క‌ల్పించి, త‌మ వైపు తిప్పుకునేలా యాత్ర నిర్వ‌హిస్తోంది.

మ‌రోవైపు తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం తాము చెప్పిందే చేస్తామ‌నే ఆలోచ‌నలో ముందుకు సాగుతోంది. అధికారంలో ఆ ప్ర‌భుత్వం ఉండ‌టం, అధికార యూనియ‌న్ కావ‌డంతో కార్మికుల హ‌క్కుల‌ను సాధించింది. కారుణ్య నియామాకాలు, త‌ల్లిదండ్రుల‌కు కార్పొరేట్ వైద్యం, లాభాల వాటా పెంపు ఇలా చెప్పుకుంటే తాము కార్మికుల‌కు ఎన్నో చేశామ‌ని ఆ యూనియ‌న్ నేత‌లు చెబుతున్నారు. తాము చేసింది చెప్ప‌డ‌మే కాకుండా, కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రి విష‌యం సైతం కార్మికులకు వివ‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే స‌మ్మె చేయ‌డంతో పాటు క‌ర‌ప‌త్రాల పంపిణీ ద్వారా కేంద్రం సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ‌పై వివ‌రించారు. మ‌రోసారి ఈ యూనియ‌న్ కూడా బొగ్గు గ‌నుల్లో ప‌ర్య‌టించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like