ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షం
-విరిగిన చెట్లు, ట్రాఫిక్కు అంతరాయం
-పలు చోట్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
-నేడు, రేపు కూడా వర్షాలు:వాతావరణ శాఖ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొమురం భీమ్, మంచిర్యాలలో జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా, మిగతా జిల్లాల్లో సైతం వర్షాలు పడ్డాయి. కొమురం భీమ్ జిల్లా బెజ్జూర్ లో 76.5 మి.మీ, రవీంద్ర నగర్ లో 68.3 మి.మీ, మంచిర్యాల జిల్లా తాండూర్ లో 6.5 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. పలు చోట్ల చెట్లు విరిగిపడిపోగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ వర్షంతో గత కొన్నిరోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించినట్లైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నేడు, రేపు కూడా వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది.
కూలిన చెట్లను తొలగించిన పోలీసులు
మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగూడ నుంచి ఇందనపల్లి బ్రిడ్జి వెళ్లే రహదారిపై అకాల వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా రోడ్డుపై చెట్లు కూలిపోయాయి. రోడ్డుపై పడిపోవడం వలన వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురయ్యింది. దీంతో జన్నారం ఎస్ఐ సతీష్ వెంటనే జేసీబీలు తెప్పించి రోడ్డుపై పడిన చెట్లను తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూశారు.
హైదరాబాద్లోనూ భారీ వర్షం..
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్,అమీర్పేట,పంజాగుట్ట,సికింద్రాబాద్,మారేడ్పల్లి,బోయిన్పల్లి,తిరుమలగిరి,మియాపూర్,అల్వాల్,బేగంపేట్,ఎల్బీనగర్,దిల్సుఖ్నగర్,నాగోల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో నగరంలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. పలు కాలనీలు జలమయమయ్యాయి.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
భారీ వర్షంతో హైదరాబాద్ నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జూబ్లీహిల్స్,యూసుఫ్గూడ, అమీర్పేట, మలక్పేట, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో పవర్ కట్ అయింది. పంజాగుట్ట కూడలి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్ కూడలి వద్ద మోకాళ్ల లోతులో నీరు చేరింది. యూసుఫ్ గూడ నుంచి మైత్రీవనం వెళ్లే మార్గంలో స్టేట్ హోమ్ వద్ద రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎల్బీనగర్ వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఓ కారు ఇరుక్కుపోయింది. ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ వద్ద భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఓ ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షం వివరాలు ఇవే..
ప్రాంతం – వర్షపాతం (మిల్లీమీటర్లు
దుబ్బాక – 108.0
బెజ్జూరు – 77.9
మారేడుపల్లి-72.8
చింతలమానేపల్లి-68.8
ముషీరాబాద్-67.0
తాండూరు – 65.0
సారంగాపూర్-54.0
సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..
బంసిలాల్ పేట్ లో 6.7 సెంటీమీటర్లు..
వెస్ట్ మారేడ్ పల్లిలో లో 6.1 సెంటీమీటర్..
అల్వాల్లో 5.9 సెంటీమీటర్లు..
ఎల్బీ నగర్ లో 5.8 సెంటీమీటర్లు..
గోషామహల్ బాలానగర్ లో 5.4 సెంటీమీటర్లు..
ఏఎస్ రావు నగర్ లో 5.1 సెంటిమీటర్..
బేగంపేటలోని పాటిగడ్డ లో 4.9 సెంటీమీటర్లు..
మల్కాజ్గిరిలో 4.7 సెంటీమీటర్లు..
సరూర్నగర్ ఫలక్నామా లో 4.6 సెంటి మీటర్లు..
గన్ ఫౌండ్రీ లో 4.4 సెంటీమీటర్లు..
కాచిగూడ , సికింద్రాబాద్ లో 4.3 సెంటీమీటర్లు..
చార్మినార్ లో 4.2 సెంటీమీటర్లు..
గుడిమల్కాపూర్ నాచారం లో 4.1 సెంటి మీటర్..
అంబర్పేట్ లో 4 సెంటీమీటర్లు..
అమీర్పేట్ సంతోష్ నగర్ లో 3.7 సెంటీమీటర్లు..
ఖైరతాబాద్లో 3.6 సెంటీమీటర్లు..
బేగంబజార్ ,హయత్ నగర్ చిలకనగర్ లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..