చేతికొచ్చిన పంట.. నీటి పాలు..

రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. జోరు వానతో పంటలు నేలమట్టమయ్యాయి. పంట చేతికొచ్చే సమయంలో ఒక్కసారిగా వచ్చిన వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో ఏమి చేయాలో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల కాంట అయిన బస్తాలు తడిసి పోయాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వర్షాలకు భారీగా నష్టపోయారు. జన్నారం,లక్ష్సెట్టిపేట,దండేపల్లి మండలాల్లో పెద్దఎత్తున ధాన్యం తడిచి ముద్దయ్యింది. లక్ష్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిచిముద్దకావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్,కడెం,మంచిర్యాల జిల్లా జన్నారం మండలాల్లో రాత్రి వర్షం భీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున మామిడి సాగు చేస్తారు. భారీ గాలులతో మామిడి కాత రాలింది.
వరి ధాన్యం కాంట మొదలై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కలలో గన్ని బ్యాగులు కాంటాలు ఏర్పాటు చేయలేదని దాని వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. చేతికొచ్చిన పంటను తరలించడంలో జాప్యం వల్ల ఆరుగాలం కష్టపడిన తమకు కన్నీరే మిగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి కళ్లాలకు గన్ని బ్యాగ్ ను సరఫరా చేసి త్వరగా తరలించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.