అన్నంలో ఎలుకమందు కలిపి, గొంతు నులిమి…

ఇష్టం లేని పెళ్లి చేయడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఒకసారి అన్నంలో విషం కలిపి హత్యాయత్నం చేసింది. అది విఫలం కావడంతో రెండోసారి గొంతు నులిమి చంపేసింది. ఛాతిలో నొప్పితో చనిపోయాడని నాటకం ఆడింది. పోలీసుల దర్యాప్తులో హత్య విషయం వెళ్లడవడంతో జైలుపాలు అయింది.
దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24)కు తొగుట మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన శ్యామల (19)తో మార్చి 23న పెళ్లయింది అయితే అప్పటికే శివ కుమార్ (20) అనే వ్యక్తితో శ్యామల మూడేళ్లుగా ప్రేమలో ఉంది. పెద్దల ఒత్తిడితో చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడు శివతో కలిసి భర్త హత్యకు ప్రణాళిక వేసింది. దీంట్లో భాగంగా ఏప్రిల్ 19న తినే అన్నంలో ఎలుకల మందు కలిపింది. అయితే అనారోగ్యానికి గురైన చంద్రశేఖర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చాడు. ఫుడ్ పాయిజన్ కావచ్చని అంతా భావించారు.
ఏప్రిల్ 28న ఆలయంలో మొక్కు ఉందంటూ శ్యామల భర్తను తీసుకొని ద్విచక్రవాహనంపై వెళ్ళింది. అనంతసాగర్ శివారులో ఏకాంతంగా గడుపుదామని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్ళింది. అక్కడ మాటువేసి ఉన్న శివ, అతని స్నేహితులు రాకేష్,రంజిత్,మేనబావ సాయికృష్ణ,వరుసకు సోదరుడు భార్గవ్ కలిసి కారు ద్విచక్ర వాహనానికి అడ్డంగా పెట్టారు. నలుగురి సహకారంతో చంద్రశేఖర్ ను అదిమిపట్టి శ్యామల, శివ గొంతు నులిమి చంపేశారు.
తర్వాత చంద్రశేఖర్ మృతదేహాన్ని కారులో సిద్దిపేట శివార్లకు తీసుకువచ్చారు. ఇదే సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని చంద్రశేఖర్ కుటుంబీకులకు ఫోన్ చేసి చెప్పింది శ్యామల. 108కి సమాచారం అందించామని, వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. కుటుంబీకులు వచ్చేసరికి చంద్రశేఖర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఛాతిలో నొప్పితో చనిపోయాడని శ్యామల బంధువులకు తెలియజేసింది. అయితే చంద్రశేఖర్ తల్లి మనెవ్వ, కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో శ్యామలపై అనుమానంతో ఆమె కాల్ డేటా పరిశీలించగా చివర్లో ఎక్కువసార్లు శివతో మాట్లాడినట్లు గుర్తించారు. ఆమెను విచారించగా అసలు విషయం తెలిసింది.