కాళ్లు మొక్కుతా సారూ.. కనికరించండి

దేశానికి అన్నం పెట్టే కర్షకుడు ఓ అధికారి కాళ్లమీద పడ్డాడు. తన పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని రోజులతరబడి అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇకనైనా తనను కనికరించి కరెంట్ కనెక్షన్ ఇవ్వమని కాళ్లమీద పడి వేడుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో చోటుచేసుకుంది.

ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వలేదని ఓ రైతు అధికారుల కాళ్లపై పడిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో జరిగింది. నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన సంతోశ్‌ వ్యవసాయ మోటారుకు విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటుకు రెండు సంవత్సరాల క్రితం డీడీ తీసి అధికారులకు అందజేశారు. ఆ తరువాత కొద్దీ రోజులకు సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్తు స్తంభాలు వేశారు. నెలలు గడిచినా కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. సమయానికి నీరందక తన పొలంలోని పంటలు ఎండిపోతున్నాయని వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని రైతు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులతో కలసి నిజాంసాగర్ ఉప విద్యుత్తు కేంద్రం వద్దకు పురుగుల మందుతో వచ్చి నిరసన తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సబ్ ఇంజినీర్ ప్రదీప్ కాళ్లపై వేడుకున్నారు. విద్యుత్‌ సదుపాయం కల్పిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. విద్యుత్తు తీగలు లేకపోవడంతో పని ఆలస్యమైందని నిజామాబాద్ నుంచి తీసుకువచ్చి వెంటనే కనెక్షన్ ఇస్తామని ప్రదీప్‌ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like