ఎస్టీపీపీ కి జాతీయస్థాయి పురస్కారాలు
-సమర్థ నీటి వినియోగానికి వాటర్ మేనేజ్మెంట్ అవార్డు
-జీరో లిక్విడ్ డిశ్ఛార్జ్ ప్లాంట్గా గుర్తింపు
-అవార్డులు ప్రదానం చేసిన ఎన్విరో ఎక్స్లెన్స్ కౌన్సిల్
-అభినందనలు తెలిపిన సీఅండ్ఎండీ

మంచిర్యాల : సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టిపిపి) అవలంబిస్తున్న పర్యావరణ హిత చర్యలకు మరోమారు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించే నీటిని అత్యంత పొదుపుగా వాడుతున్నందుకు జాతీయస్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ అవార్డుకు, అలాగే విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించిన అనంతరం ఆ నీటిని రీసైకిల్ చేస్తూ పునర్వినియోగిస్తున్నందున జీరో లిక్విడ్ డిశ్ఛార్జ్ ప్లాంట్గా అవార్డుకు ఎంపికైంది.
ముంబయికి చెందిన ప్రముఖ పర్యావరణ సంస్థ ఎన్విరో ఎక్స్లెన్స్ కౌన్సిల్ సలహాదారు, ఎన్టిపిసి విశ్రాంత ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వి.ఎన్.చౌదరి ఆధ్వర్యంలోని జూరీ సభ్యులు దక్షిణ భారతదేశంలోని 500 మెగావాట్లు అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గలిగిన 75కి పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు మదింపుచేశారు. అనంతరం ఎస్టిపిపిని రెండు కేటగిరీల్లో పురస్కారానికి ఎంపిక చేయడం విశేషం. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సదస్సులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ అవార్డులు ప్రదానం చేశారు.
సాధారణంగా 500 మెగా వాట్లు అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కోసం గరిష్టంగా 3.5 క్యూబిక్ మీటర్ల నీటిని వినియోగించవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనలు ఉన్నాయి. అయితే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో తీసుకుంటున్న చర్యల వల్ల ఈ నీటి వినియోగం 2.72 క్యూబిక్ మీటర్లు మాత్రమే పరిమితం అవుతుండటం విశేషం. ఎస్టిపిపి తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ ఎన్విరో ఎక్స్లెన్స్ కౌన్సిల్ ఎస్టిపిపి కి వాటర్ మేనేజ్ మెంట్ అవార్డుకు ఎంపిక చేశారు.
అలాగే ఎస్టిపిపిలో హై కాన్సన్ట్రేటెడ్ స్లర్రీ డిస్పోజల్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నీటి పునర్వినియోగించడం, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు తదితర చర్యలతో జీరో లిక్విడ్ డిశ్ఛార్జ్ ప్లాంట్గా ఎస్టిపిపి నిలిచిందని నిర్వాహకులు పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చడంలోనే కాకుండా పర్యావరణ హిత చర్యలతో దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్ కేంద్రాలకు ఆదర్శంగా ఎస్.టి.పి.పి. నిలుస్తోందని వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వాహకులు ప్రశంసించారు.
సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ అభినందనలు
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయ స్థాయి పురస్కారాలు లభించడంపై పట్ల సంస్థ సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్ ) నమోదు చేస్తూ మొదటి స్థానంలో నిలవడమే కాకుండా పర్యావరణ హిత చర్యలు పాటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్న డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావును, ఎస్.టి.పి.పి. ఉద్యోగులను అభినందించారు. అన్నింటిలోనూ దేశంలోనే అత్యుత్తమ థర్మల్ కేంద్రంగా ఎస్.టి.పి.పి. తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్టీపీపీ నుండి చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ ఎస్.కె.సుర్, చీఫ్ (ఓఅండ్ఎం) జెఎన్.సింగ్, ఏజీఎం(ఈఅండ్ఎం) చినబస్విరెడ్డి, డీజీఎం (వాటర్మేనేజ్మెంట్) జనగామ శ్రీనివాస్, ఎస్ఈ (ఐఈ) ఎం.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.