రేవంత్ వ్యాఖ్యల్ని ఖండించిన కాంగ్రెస్ నేత

కులాల విషయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను విబేదిస్తున్నానని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రెడ్లు, వెలమలకు మధ్య ఎటువంటి విబేధాలు లేవన్నారు. వెలమలు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానిది కాదన్నారు. చొక్కారావు లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాలు, కులాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పీసీసీ చీఫ్గా ఆయన మాట్లాడాల్సిన మాటలు కావన్నారు. సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రేవంత్ మాట్లాడింది ఆయన వ్యక్తిగతమన్నారు. నిన్న,మొన్న వచ్చిన వారికి కాంగ్రెస్ పార్టీ గురించి తెలియని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. రెడ్డి కులం గొప్పతనం గురించి చెప్పుకొచ్చిన రేవంత్… రెడ్లను నమ్ముకున్న వాళ్లు ఎవరూ మోసపోలేదని.. పార్టీలు గెలవాలంటే రెడ్లకే పార్టీల పగ్గాలు అప్పజెప్పాలని అన్నారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టి వెలమలైన పద్మనాయకులను దగ్గరికి తీశాడని అందుకే కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్నారు.