21 నెలల బాలుడి కిడ్నాప్
-బాలున్ని కాపాడిన పోలీసులు
-నిందితుల అరెస్టు

మంచిర్యాల :మంచిర్యాలలో 21 నెలల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. కొందరు వ్యక్తులు ఆ బాలున్ని కిడ్నాప్ చేయడంతో అలర్ట్ అయిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి బాలున్ని తల్లి వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాఫర్నగర్ చెందిన బావురి చాందిని అనే మహిళా తన 21 నెలల కొడుకు బావురి షాజస్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ తహసినోద్దీన్ కేసుదర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద ఉన్న బాబు జాఫర్నగర్లో కిడ్నాప్ చేసిన బాబు అని ఒప్పుకున్నారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.
ఇందులో కిచ్చసంగు అనే వ్యక్తి రైల్వేస్టేషన్ ఏరియాలో కోలలు, పీటలు, పప్పుగుత్తులు, ఆటబొమ్మలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. గతంలో గంజాయి అమ్ముతున్న నేరంలో జైలుకు సైతం వెళ్లి వచ్చాడు. తను నడుపుతున్న ఆటోయాక్సిడెంట్ అవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. తనకు పుట్టిన పాప హైదరాబాద్లో అమ్మితే 1,50,000/- రూపాయలు ఇచ్చారు. మళ్ళీ అదే విధంగా కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు. చాందిని అనే మహిళకు భర్త కూడా లేకపోవడంతో ఆమె బాబుని కిడ్నాప్ చేయాలని భావించాడు. ఈ నెల 1న రాత్రి భోజనం చేసి చాందిని తన ఇద్దరు పిల్లలతో ఇంటి బయట పడుకుంది. ఆటోలో ఆ బాబుని బస్స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా తన అత్తగారింటికి తీసుకెళ్లారు. బాబును అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు. తిరిగి మంచిర్యాల వైపు వస్తుండగా, పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు.
నిందితులైన కిచ్చసంగు, వాంకుడోత్ నరేష్, వొర్సుకొమురయ్య, వొర్సువిజయ, వొర్సు సంపత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబుని కాపాడడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను సిబ్బందిని మంచిర్యాల ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ అభినందించారు.