అధికారిక వాహనంలోనే అత్యాచారం..

హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్ బోర్డు చైర్మన్ అధికారికంగా వినియోగించే ఇన్నోవా కారులోనే బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు.
అమ్నీషియా పబ్బులో పార్టీ చేసుకున్నక్రమంలో రుమేనియాకు చెందిన మైనర్ బాలికను రెండుసార్లు కార్లు మార్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అధికారికంగా వినియోగించే ఇన్నోవా కారులోనే బాలికపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరుతో ఉన్న వాహనానికి ‘ప్రభుత్వ వాహనం’ అనే స్టిక్కర్ కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పోలీసులు ఇన్నోవాను స్వాధీనం చేసుకున్నప్పుడు మాత్రం ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ మాయమైనట్లు సమాచారం. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాల్సి ఉంది.
ఎమ్మెల్యే కొడుకు ప్రమేయానికి సంబంధించి.. తొలుత.. సీసీ ఫుటేజీ పరిశీలన ద్వారా అతడికి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. బాలికతో అతడు కూడా పబ్ నుంచి బేకరీకి వెళ్లాడు. తిరిగివచ్చేటప్పుడు మాత్రం ఇన్నోవా వాహనం ఎక్కలేదు. దీంతో అతడి పాత్ర నిర్ధారణ కాలేదని పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ ప్రకటించారు. ఇదిలా ఉండగా బాలికతో కలిసి ఎమ్మెల్యే కుమారుడు బెంజ్ కారులో ప్రయాణిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వీటిని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు మీడియాకు విడుదల చేశారు. దీంతో సీన్ రివర్స్ అయింది.
ఎమ్మెల్యే కుమారుడు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రభుత్వం, పోలీసులపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు.. ఎమ్మెల్యే కుమారుడి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చే ప్రయత్నాలు ఆరంభించారు. ఈ నేపథ్యంలో బాధితురాలి వద్ద పోలీసులు మరోసారి వాగ్మూలం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం ఎమ్మెల్యే కుమారుడి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చుతారు. బాధితురాలి వాగ్మూలాన్ని సెక్షన్ 164 కింద జడ్జి ఎదుట రికార్డు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.