ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులు
-పట్టుబడిన ఇద్దరు టెర్రరిస్టులు
ఆ గ్రామస్తులు చేసిన పని ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. తమ ప్రాణాలకు తెగించి అత్యంత ధైర్య సాహాసాలతో ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నారు వారు… వివరాల్లోకి వెళితే…
జమ్మూకశ్మీర్లో రియాసి సమీపంలోని తుక్సాన్ గ్రామంలో ఆదివారం ఉదయం ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇద్దరి దగ్గర భారీ ఆయుధాలు ఉన్నాయి. వారిద్దరూ పుల్వామాకు చెందిన ఫైజల్ అహ్మద్ దార్, రాజౌరికి చెందిన తాలిబ్ హుస్సేన్గా పోలీసులు గుర్తించారు. వారి దగ్గర నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, ఏడు గ్రెనేడ్లు, ఒక పిస్టల్, భారీ మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
రెండు మూడేళ్లుగా రాజౌరనీ-పూంచ్ జిల్లాలో జరిగిన అన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు హుస్సేన్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. రాజౌరిలోని కొట్రాంక ప్రాంతంలో జరిగిన అనేక పేలుళ్లకు కారణమైన బృందానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారని వారు చెప్పారు. “హుస్సేన్ పాకిస్థాన్లో ఉన్న ఎల్ఈటీ ఉగ్రవాది ఖాసిమ్తో నిరంతరం టచ్లో ఉన్నాడు. రాజౌరి జిల్లాలో కనీసం మూడు పేలుడు కేసులు, పలు హత్యలు, గ్రెనేడ్ పేలుళ్లలో పాల్గొన్నాడు.” అని పోలీసులు తెలిపారు.
మరోవైపు గ్రామస్థుల ధైర్యసాహాసాలను మెచ్చిన కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ రూ.2 లక్షలను నజరానాగా ప్రకటించారు. మరోవైపు ఇద్దరు ముష్కరులను పట్టుకున్న తుక్సన్ గ్రామస్థులకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. “ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను పట్టుకున్న టక్సన్ ధోక్, రియాసీ గ్రామస్థుల ధైర్యానికి నేను వందనం చేస్తున్నాను. సామాన్యుల ఇలాంటి దృఢ సంకల్పం ఉగ్రవాదం అంతం ఎంతో దూరంలో లేదని తెలియజేస్తోంది.” అని ఆయన చెప్పారు.