ఇక యూరియా బస్తాల్లో కాదు… బాటిళ్లలో..
యూరియా బస్తాలు తీసుకువెళ్లాంటే ఆ బస్తాలు మోసుకువెళ్లడం.. అందులోనూ బురదలో ఉండే పొలానికో, చేనుకో తీసుకువెళ్లడం అంటే.. కొంచం కష్ట సాధ్యమే.. కానీ ఇక నుంచి అలాంటి కష్టాలకు చెక్ పడనుంది. యూరియా బస్తాల్లో కాకుండా, బాటిళ్లలో తీసుకువెళ్లచ్చు.. ఎలా అంటారా..? ఇలా…
వ్యవసాయరంగంలో ఓ పెద్ద మార్పు ఇది.. ఒక రకంగా విప్లవమే అని చెప్పొచ్చు. ఒక బస్తా యూరియాను కేవలం అరలీటర్ బాటిలో పట్టేలా తయారు చేసింది ఇఫ్కో సంస్థ. అంతేకాకుండా, గతంతో పోల్చితే తక్కువ ధరకే లభ్యమయ్యేలా ఈ యూరియా తయారు చేశారు. ఇలాంటి నానో యూరియా తయారీ ప్రపంచంలోనే మొదటిసారని ఆ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా, దీని వాడకం వల్ల పంట దిగుబడి కూడా ఎనిమిది శాతం పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం తెల్లని గుళికల రూపంలో ఉండే యూరియాను ఇఫ్కో (IFFCO) నానో బయో టెక్నాలజీ పరిశోధన సంస్థ ద్రవరూపంలో ఉండే నానో యూరియాను తయారు చేసింది. ప్రస్తుతం రైతులకు పెట్టుబడి పెరిగిపోతున్న నేపథ్యంలో రైతులకు ఒక రకంగా శుభవార్తని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ అరలీటర్ బాటిల్ నానో యూరియాలో 40 వేల పీపీఎంల నైట్రోజన్ ఉంటుంది. లిక్విడ్ యూరియాను నీటిలో కలిపి పిచికారీ చేస్తే సరిపోతుందని, ఈ యూరియాను పత్తి, మొక్కజొన్న తదితర 94 పంటల మీద పిచికారీ చేయొచ్చని సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంప్రదాయ యూరియాతో పోలిస్తే.. నానో యూరియా తక్కువ ధరకు లభిస్తుంది. అంతే కాదు.. దీని వాడకం వల్ల పంట దిగుబడి 8 శాతం పెరుగుతుందని అంచనా. సబ్సిడీలు పోనూ యూరియా బస్తా ధర రూ.268 ఉండగా.. నానో యూరియా బాటిల్ ధర రూ.240 లోపే లభించనుంది. ప్రస్తుతానికి మన దేశంలో ఏకైక నానో యూరియా తయారీ ప్లాంట్ గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. రోజుకు 1.5 లక్షల బాటిళ్ల నానో యూరియాను ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది. కాగా రెండో ప్లాంట్ను కర్ణాటకలో దేవనహళ్లి తాలుకాలోని నాగనాయకనహల్లిలో ఇఫ్కో ఏర్పాటు చేస్తోంది.