తెలంగాణ ఎంసెట్లో ఆంధ్ర విద్యార్థుల హవా
ఎంసెట్, ఈసెట్ ఫలితాల విడుదల చేసిన మంత్రి సబిత

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్ టాప్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ అగ్రికల్చర్ ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో ఏపీ విద్యార్ధులే నిలవడం గమనార్హం. ఇంజనీరింగ్ విభాగంలో లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి ఫస్ట్ ర్యాంకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాయిదీపిక సెకండ్ ర్యాంక్, గుంటూరుకు చెందిన కార్తికేయ మూడోర్యాంకు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో గుంటూరుకు చెందిన నేహా ఫస్ట్ ర్యాంక్, విశాఖ జిల్లాకు చెందిన లోహిత్ సెకండ్ ర్యాంక్, గుంటూరుకు చెందిన తరుణ్ మూడో ర్యాంక్ సాధించారు.
తెలంగాణ ఎంసెట్ తో పాటు ఈసెట్ ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈసెట్లో 90.7 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్, ఈసెట్లలో ర్యాంకులు సాధించిన విద్యార్దులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎంసెట్, ఈసెట్ పరీక్షల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. వర్షాలు పడుతున్న సమయంలో కూడా పరీక్షలను నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
TS ECET 2022 ఫలితాలతో పాటు తుది సమాధాన కీ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫలితాలు www.ecet.tsche.ac.inవెబ్ సైట్ లోనే కాకుండా.. manabadi.co.inలో కూడా అందుబాటులో ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జూలై 13న నిర్వహించాల్సిన ఈ-సెట్ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఈ పరీక్షను ఆగస్టు 1, 2022న నిర్వహించారు. ఈ సెట్ లో 90.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. 19,953 మంది విద్యార్ధులు క్వాలిఫై అయ్యారు..