బంగారు భారతం కోసం ముందుకురండి
-మరో ఉద్యమానికి సిద్ధం కండి
-మీ వెంటే మేముంటాం
-బీజేపీ ముక్త్ భారత్ మీరే సాధ్యం చేయగలరు
-ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్

Balka Suman asked KCR to enter the country’s politics: ‘భారతదేశంలో దుర్గ్మారపు పాలన నడుస్తోందని.. ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదని.. దేశంలో బీజేపీ రాక్షస పాలన చేస్తోందని’ ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు, దళితులు, మైనార్టీలు, గిరిజనులు, ఆదివాసీలు, యువతకు, మహిళలకు దేశంలోని ఏ వర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. దేశంలోని పటిష్ట ప్రజాస్వామిక పునాదులను ధ్వంసం చేస్తూ దేశాన్ని 100 ఏండ్లు వెనక్కి తీసుకువెళ్లారని దుయ్యబట్టారు. ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బాల్క సుమన్ స్పష్టం చేశారు. దేశంలోని వ్యవస్థలను కాపాడుకోవడానికి నడుం కట్టాల్సిన అవసరం ఉందని అన్ని వర్గాలు కోరుతున్నాయని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని సమస్యల గురించి, కేంద్రం చేయాల్సిన పనుల గురించి చెబుతున్నారని, అయినా కేంద్రంలోని ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోందని అన్నారు. ఉద్యమంలో పట్టుబట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించడమే కాకుండా, తెలంగాణ అభివృద్ది కోసం కృషి చేస్తున్నట్లుగా మళ్లీ నడుం కట్టాల్సిందే భారత రాజకీయాల్లోకి రావాల్సిందేనని ఆయన కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. మీకున్న జ్ఞాన సంపద, ఉద్యమ నేతగా మీకున్న అనుభవం ఈ దేశానికి ఉపయోగపడాలని కోరారు. మీకు అడుగులో అడుగుగా తోడు నీడగా మీ వెంట ఉంటాం. ఉద్యమంలో ఎలా పనిచేశామో..? అభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం అయ్యామో మీరు భారత్ కోసం చేస్తున్న పనిలో కూడా ఉంటామని ఆయన అన్ని జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షుల తరఫున హామీ ఇచ్చారు.
అన్ని రంగాల నిపుణులు దేశానికి ఓ కొత్త నాయకుడు కావాలని కోరుతున్నారని బాల్క సుమన్ వెల్లడించారు. కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లో కి రావాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లో చూడాలనుకుంటుంన్నారని అన్నారు. బీజేపీ ముక్త్ భారత్ దిశగా దేశాన్ని నడిపించే ఏకైక నేతగా కేసీఆర్ ను చూస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్ జీ ఆప్ ఆగేబడో హమ్ ఆప్ కా సాత్ హై అని బాల్క స్పష్టం చేశారు.