కాంగ్రెస్ నేతల చందాల దందా

Controversy over subscriptions in Rahul’s Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విరాళం తక్కువగా ఇచ్చాడంటూ ఓ కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని కొట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు… ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఏం చేయాలో అర్ధం కాని కాంగ్రెస్ అధిష్టానం చివరకు ముగ్గురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ యాత్ర కోసం పార్టీ కార్యకర్తలు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేథ్యంలో తాజాగా కేరళలో వెలుగు చూసిన ఒక ఘటనకు దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రాహుల్ యాత్రకు 2,000 రూపాయల చందా ఇవ్వనందుకు ఒక కూరగాయల వ్యాపారిపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేశారు.
రాష్ట్రంలోని కొల్లాం పట్టణంలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భారత్ జోడో యాత్రకు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు చందాలు వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొల్లాం కాంగ్రెస్ నేతలు స్థానిక కూరగాయల మార్కెట్లో వసూళ్లు చేస్తుండగా.. ఒక వ్యాపారి చందా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా కాంగ్రెస్ కార్యకర్తలు అతడి కూరగాయల్ని చెల్లచెదురుగా పడేశారు. అతడికి బెదిరింపులు చేశారు.
ఈ విషయమై బాధితుడైన కూరగాయల వ్యాపారి ఎస్.ఫజాస్ స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ కార్యకర్తలు నా షాపుకి వచ్చి భారత్ జోడో యాత్రకు డబ్బులు అడిగారు. నేను 500 రూపాయలు ఇచ్చాను. కానీ వారు 2,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని నేను బతిమాలుకున్నాను. కానీ వారు వినకుండా వెయింగ్ మిషన్, కూరగాయలు విసిరికొట్టారు. నన్ను బెదిరించారు. తిట్టారు’’ అని తెలిపాడు.
దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విధంగా వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు పార్టీ నేతలను కేరళ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకరన్ సస్పెండ్ చేశారు. కేరళలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. నిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చిన కాంగ్రెస్.. ఇవాళ ఉదయం 7 గంటలకు పాదయాత్రను ప్రారంభించింది. కేరళలోని కొల్లాం జిల్లాలో ఎనిమిదోరోజు రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. కేరళలో మొత్తం 19 రోజులు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర పూర్తయ్యాక రాహుల్ గాంధీ గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మరో యాత్ర సాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు.