కారం, నూనె పెట్టైనా సాదుకుంటం
-హాస్టల్లో మా పిల్లలను ఉంచి సంపుకోం
-కాగజ్ నగర్ మైనార్టీ గురుకుల పాఠశాల ఖాళీ
-పిల్లలను తీసుకువెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు
-టీసీలు సైతం తీసుకుపోయిన విద్యార్థులు

Parents angry over negligence of Kagajnagar minority gurukula school authorities: ‘మా పిల్లలకు కారం, నూనె పెట్టి అయినా సాదుకుంటాం.. ఈ హాస్టల్లో ఉంచి సంపుకోలేం.. ఇంతకు ముందు ఇక్కడ మంచిగుండే.. అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు..పిల్లలను మాత్రం ఇక్కడ ఉంచేది లేదు.. తీసుకువెళ్తాం’ ఇదీ కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రుల మనోభావం.
ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు 200 మంది విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇందులో కొందరు ఏకంగా టీసీలు తీసుకువెళ్లిపోయారంటే ఇక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కొద్ది రోజులుగా భోజనం సరిగ్గా పెట్టడం లేదు. రెండు రోజుల నుంచి పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. అన్నంలో తెల్ల పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొదటగా 11 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించగా, తర్వాత ఆ సంఖ్య 40కి పెరిగింది. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.
విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు గురుకుల పాఠశాలకు తరలివచ్చారు. పిల్లలు పడుతున్న అవస్థలు చూసి వారు కూడా కన్నీటి పర్యంతయ్యారు. తాము కూలీనాలీ చేసుకునే పేద వాళ్లమని తమ పిల్లలు మంచిగా చదువుకుంటారని ఇక్కడకి పంపితే తిండి సరిగ్గా లేక వారు చనిపోయే స్థితికి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచమంటూ విద్యార్థులను ఇండ్లకు తీసుకువెళ్లారు. కొందరైతే అధికారుల ఉదాసీన వైఖరిపై దుమ్మెత్తిపోశారు.