సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల బస్సులు సీజ్
-ఫిట్నెస్, సరైన పత్రాలు లేవు
-మూడు గంటల పాటు ఇబ్బందులు పడ్డ విద్యార్థినులు
Singareni Women’s Degree College Buses Seized: అది కళాశాలకు చెందిన బస్సు… సరైన కండీషన్లో లేదు. పత్రాలు లేవు. నడిరోడ్డుపై మూడు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో అందులో అవస్థలు పడుతున్న విద్యార్థినులను వేరే వాహనంలో వారిని తరలించారు. సమాచారం అందుకున్న ఆ బస్సుతో పాటు మరో బస్సును సైతం సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మందమర్రి పట్టణంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించిన బస్సు బెల్లంపల్లిలో మూడు గంటల పాటు నిలిచిపోయింది. విద్యార్థి బస్సులోనే అవస్థలు పడగా వేరే వాహనంలో వారిని కళాశాలకు తరలించారు. స్థానిక విద్యార్థి సంఘం నాయకులు RTA అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు ఆ బస్సుతో పాటు అదే కళాశాలకు చెందిన మరో బస్సుకు సైతం ఫిట్నెస్ లేదని దానిని సైతం సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద మాట్లాడుతూ మందమర్రి సింగరేణి డిగ్రీ కళాశాలకు సంబంధించి సరైన పత్రాలు లేని ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేశామన్నారు. ఇకపై పాఠశాల కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా వాహనాల ఫిట్నెస్ చూసుకోవాలని కోరారు.
అధికారులు ఏం చేస్తున్నట్లు..
పాఠశాలలు, కళాశాలలు ప్రారంభ సమయంలో బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలని లేకపోతే సీజ్ చేస్తామని హెచ్చరిస్తారు. పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తామని పత్రికా ప్రకటనలు జారీ చేస్తారు. జిల్లాలో ఫిట్ నెస్ లేకుండా చాలా కళాశాలలు, పాఠశాలల బస్సులు రోడ్డుపైన తిరుగుతుంటాయి. నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను బస్సులు, వాహనాల్లో కుక్కి తీసుకువెళ్తుంటారు. ఇవన్నీ రవాణా శాఖ అధికారులకు కనిపించడం లేదని దుయ్యబడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తప్ప మిగతా సమయాల్లో పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జరిగిన ఘటనలో సైతం విద్యార్థి సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు స్పందించారు తప్ప వారికి వారుగా కేసు నమోదు చేయలేదని చెబుతున్నారు.