చలి పులితో గజ గజ
People suffer from cold: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగిపోయింది. చాలాచోట్ల సింగల్ డిజిట్ కే పరిమితమైన వాతావరణంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో చలి పంజా విసురుతోంది. మూడు రోజులుగా చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ పడిపోయాయి. కొమురం భీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో 6.5గా నమోదు అయింది. నిర్మల్ జిల్లా 7.9, మంచిర్యాల జిల్లాలో 9.4 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి.
మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం వల్ల రాబోయే రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజులపాటు చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని, వారం తర్వాత మళ్లీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
చలి తీవ్రతతో జనం గజగజ వణుకుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. మధ్యాహ్నం కూడా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో జనం ఇల్లు విడిచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకు కూడా పొగ మంచు వీడటం లేదు. మరో ఐదు రోజులు చలి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
చలి పెరగడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులతోపాటు ఆస్తమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.