ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం
కలెక్టర్ బాదావత్ సంతోష్

Manchiryal: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో ట్రైనీ కలెక్టర్ పి.గౌతమితో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ఆ దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. జిల్లాలోని కాసిపేట మండలం కోమటిచేనుకు చెందిన రామటెంకి అనూష ఫిష్ పాండ్ నిర్వహిస్తున్నామని, చేపలకు స్నేహ కంపెనీ ఫీడ్ వినియోగిస్తున్నామన్నారు. ఖర్చు భారమైనందున ఫీడ్ రాయితీపై ఇప్పించాలని కోరారు.
జిల్లాలో పని చేస్తున్న పార్ట్ టైం కార్మికులకు జీ.ఓ.ఎం.ఎస్.నం. 64 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరుతూ పార్ట్ టైమ్ కార్మికులు వినతిపత్రం సమర్పించారు. జన్నారం మండలం బాదంపల్లి గ్రామానికి చెందిన గూడెపు లక్ష్మీ తాను బాదంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకంలో వంట మనిషిగా పని చేస్తున్నానని, తనను అకారణంగా విధుల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. జైపూర్ మండలం రామారావుపేట గ్రామానికి చెందిన మోతె గౌరిదేవి తన భర్త మృతి చెందినందున ఆయన నిర్వహిస్తున్న టేలా నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్నానని, అది శిథిలావస్థకు చేరినందున కొద్దిపాటి స్థలాన్ని ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
హాజీపూర్ మండలం దొనబండ గ్రామానికి చెందిన యెసంత శంకరమ్మ తన భర్త 2021లో కొవిడ్ కారణంగా మృతి చెందాడని, పరిహారం ఇంత వరకు అందలేదన్నారు. దండేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన గడ్డం రాజలింగు తనకు గ్రామ శివారులో గల భూమిని అక్కల రాజయ్య అనే అతనికి కౌలుకు ఇచ్చానని ఆయన కుమారులు తనకు తెలియకుండా వారి పేరిట మార్పు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు. లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామస్తులు తమ గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.