సింగరేణి పరిరక్షణకు జోక్యం చేసుకోండి
Singareni:సింగరేణి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి(TBGKS President Miryala Raji Reddy) కోరారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్రెడ్డి(Union Coal Minister Kishan Reddy)కి లేఖ రాసిన ఆయన.. బొగ్గు బ్లాకుల కేటాయింపు నుంచి వేతన సవరణ వరకు, పర్యావరణ అనుమతులు నుంచి ట్రేడ్ యూనియన్ ఎన్నికల వరకు మొత్తం తొమ్మిది కీలక డిమాండ్లను కేంద్రం ముందుంచారు. సింగరేణి ప్రయోజనాలను కాపాడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిర్యాల రాజిరెడ్డి కేంద్ర మంత్రికి రాసిన లేఖలోని ముఖ్యాంశాలు ఇవే..
1. బొగ్గు బ్లాకుల కేటాయింపు: శ్రావణపల్లి, కె.కె. 6 యు.జి. మైన్, మణుగూరు డిప్ సైడ్ బ్లాక్లతో సహా, వేలానికి సిద్ధంగా ఉన్న అన్ని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలి.
2. ప్రైవేట్ కేటాయింపుల రద్దు: కోయగూడెం-III సత్తుపల్లి-III బొగ్గు బ్లాకులను గతంలో ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన నిర్ణయాన్ని రద్దు చేసి, ఆ బ్లాకులను తిరిగి సింగరేణి సంస్థకే కేటాయించాలి.
3. పర్యావరణ అటవీ అనుమతులు: సింగరేణి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (PSUs) స్థాయి ప్రాధాన్యతతో పరిగణనలోకి తీసుకుని, పెండింగ్ లో ఉన్న పర్యావరణ అటవీ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలి.
4. బకాయిల వసూలు: టి.జి. జెన్కో (TGGENCO) మరియు టి.జి. పి.సి.సి (TGPCC) /TGTRANSCO) సంస్థల నుండి సింగరేణికి రావాల్సిన సుమారు 57.000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి.
5. విచారణ నివేదికల వెల్లడి: బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ నిర్వహించిన సైట్ విజిట్ సి.ఎస్.ఆర్ (CSR) కుంభకోణాలపై జరిగిన విచారణ నివేదికలను బహిర్గతం చేయాలి. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
6. వేతన సవరణ: ఎన్.సి.డబ్ల్యూ.ఏ (NCWA) వేతన కమిటీని తక్షణమే ఏర్పాటు చేసి, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు వేతన ఒప్పందాన్ని (Coal Wage Agreement) త్వరగా పూర్తి చేయాలి.
7. ప్రత్యేక కేటాయింపులు: ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు గనులను వేలం ప్రక్రియ లేకుండానే, సింగరేణి సంస్థకు కేటాయించేందుకు వీలుగా అనుకూల నిర్ణయం తీసుకోవాలి.
8. ఉన్నత స్థాయి దర్యాప్తు: 2023-24… 2024-25 ఆర్థిక సంవత్సరాలలో బొగ్గు ఉత్పత్తి (సుమారు 93.73 మిలియన్ టన్నుల ఓవర్ రిపోర్టింగ్) బొగ్గు నిల్వల గణాంకాల్లో జరిగిన అక్రమాలు, పన్ను చెల్లింపులలోని అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో (SIT) విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
9. ట్రేడ్ యూనియన్ ఎన్నికలు: సింగరేణిలో కార్మిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, కేంద్ర కార్మిక శాఖ ద్వారా తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలి.