మరణాల మధ్య జననం..
భూకంప శిథిలాల మధ్య జన్మించిన చిన్నారి

Turkey Earth Quake: ఎక్కడ చూసినా శిథిలాల గుట్టలే.. చుట్టూ శవాలే.. అయిన వాళ్లను కోల్పోయిన వాళ్ల ఆక్రందనలు.. చాలా మంది తమ వాళ్లను కోల్పోయిన బాధతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కానీ, ఆ శిథిలాల మధ్యే, శవాల మధ్యే ఓ చిన్నారి కండ్లు తెరిచింది.
తుర్కియే, సిరియాలో భూకంప వల్ల వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ రెండు దేశాల మధ్య సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. సిరియాలోని కుప్పకూలిన ఓ భవనం శిథిలాల నుంచి అప్పుడే పుట్టిన పసికందును సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భూకంపం వచ్చిన కాసేపటికి ఆ బిడ్డ తల్లికి పురిటి నొప్పులు వచ్చాయి. బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి చనిపోయింది. ఆ పాప తండ్రి, నలుగురు తోబుట్టువులు కూడా శిథిలాల కింద మృత్యువాత పడ్డారు.
సహాయక చర్యల్లో భాగంగా శిథిలాలను తొలగిస్తున్న సమయంలో చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నెమ్మదిగా మట్టిని, రాళ్లను తొలగించి ఆ పసికందును సురక్షితంగా బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారికి అయా (Aya) అని నామకరణం చేశారు. అయా అంటే ‘అద్భుతం’ అని అర్థం. ఇంతటి ఘోరవిపత్తులో ప్రాణాలతో బయటపడినందుకు శిశువుకు ఆ పేరు పెట్టారు. ఆ చిన్నారికి వైద్యుడి భార్య పాలు పట్టి ఆలనాపాలనా చూసుకుంటోంది.