మా భూభాగం నుంచి తరలిస్తాం..
రష్యా రాయబారి అలిపోవ్
![](https://naandinews.com/wp-content/uploads/2022/03/air-india-privatisation-16415518103x2-1-750x430.webp)
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందరికీ తగిన రక్షణ కల్సించి, వారిని సురక్షితంగా తమ భూభాగం గుండా స్వదేశానికి పంపుతామని భారత్ లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘మంగళవారం చనిపోయిన మెడిసిన్ విద్యార్థి నవీన్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ విషయంపై రష్యా దర్యాప్తు చేస్తోంది. ఖార్కివ్, తూర్పు ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల రక్షణ కోసం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారిని రష్యా మీదుగా అత్యవసరంగా తరలించాలన్న భారత అభ్యర్ధనను స్వీకరించి అందుకు తగిన చర్యలు చేపడుతున్నా’మని వివరించారు. మరోవైపు యుద్ధం నేపథ్యంలో క్షిపణి రక్షక ఎస్ 400 పరికరాల సరఫరాకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేశారు. తమ పరిస్థితి భారత్ బాగా అర్థం చేసుకుందని, దీనికి ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్ ప్రక్రియకు భారత్ దూరంగా ఉండడమే నిదర్శనమన్నారు.