మీరు వంద రూపాయలకు పనిచేసే మనుషులు

-పోలీసులకు ఎంఐఎం లీడర్ వార్నింగ్
-సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌

మీరు వంద రూపాయలకు పనిచేసే మనుషులు.. ఇక్కడకు కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ వచ్చాడని.. మీ ఎస్సై, సీఐకి చెప్పండంటూ వార్నింగ్ ఇచ్చాడో ఎంఐఎం లీడ‌ర్‌… ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. హైదరాబాద్‌లో రాత్రి వేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పినందుకు పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు ఆయ‌న‌. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్ విసిరారు. హైద‌రాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతంలో రాత్రి హోటల్‌ తెరిచి ఉంచడాన్ని గమనించిన పోలీసులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు.. దీంతో రెచ్చిపోయిన భోలక్‌పూర్ కార్పొరేటర్‌ గౌసుద్దీన్ పోలీసుల‌కు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. రంజాన్‌ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషీరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామంటూ గౌసుద్దీన్ తేల్చిచెప్పారు. అయితే.. తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని.. సమయానికి హోటళ్లను మూసివేయాలని పోలీసులు చెప్పబోతే.. రంజాన్ నెలపాటు ఇటు వైపు రావొద్దంటూ పోలీసులకు స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ విష‌యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో మజ్లిస్‌ వాళ్లకు ఒక రూల్, ఇతరులకు మరో రూల్ ఉందా అంటూ రాజాసింగ్ పోలీసులను ప్రశ్నించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ, హైదరాబాద్ సీపీకి ట్యాగ్ చేసి కోరారు.. ఆ ట్వీట్‌కు హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో 353, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like