విదేష్వాన్ని ఓడిద్దాం.. అభివృద్ధిని ఆహ్వానిద్దాం..
-విచ్ఛిన్నకర శక్తులు కుట్రలు చేస్తున్నాయి
-అందరం అప్రమత్తంగా కుట్రలను తిప్పికొడదాం
-తెలంగాణ స్వరాష్ట్రమై దేశంలోనే అగ్రగామిగా రూపుదాల్చింది
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్
![](https://naandinews.com/wp-content/uploads/2022/09/DSC_0851_1600x1067-750x430.jpg)
National Unity Vajrotsavala is prominent among Mancharyal: తెలంగాణలో సమస్త జనులు ఏకమై చేసిన పోరాటాల వల్ల రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి పరివర్తన చెందిందని, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో ఆయన జాతీయ జెండా ఎగురవేసి వేడుకలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జాతీయ సమైక్యత అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదు. ప్రజల మధ్య, విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత అన్నారు. ఆనాడు తెలంగాలో సమస్త జనులు ఏకమై చేసిన పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రేపాలని విచ్ఛిన్నకర శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు. మనమందరం అప్రమత్తంగా కుట్రలను తిప్పికొడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. వివేకంతో విద్వేషాన్ని ఓడిద్దామని, సకల జనుల విశ్వాసంతో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగిద్దామని కోరారు.
చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందన్నారు. 74 సంవత్సరాల కిందట ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వత్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఆదివాసీ యోధుడు కుమ్రంభీమ్, తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీంరెడ్డి నర్సింహరెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వెంకటేశ్వర్ రావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందామన్నారు.