ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేందుకే పాద‌యాత్ర‌

-తెలంగాణ ప్ర‌జ‌ల సంక‌ల్పం నెర‌వేరుస్తాం
-దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయ మార్గం
-విలేక‌రుల స‌మావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka: నిరాశ‌, నిస్పృహ‌ల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేందుకే తాను పాద‌యాత్ర చేప‌డుతున్న‌ట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్ల‌డించారు. ఆయ‌న ఆదివారం గాంధీభ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగ 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజులపాటు పాదయాత్ర చేస్తున్నానని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కానీ బీఆర్ఎస్ దశాబ్ద పరిపాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేసిందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

బీఆర్ఎస్ పరిపాలనలో ఏ ఒక్క లక్ష్యాన్ని చేరుకోలేదు. దీంతో ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారని భ‌ట్టి స్ప‌ష్టం చేశారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు ధైర్యం ఇచ్చి వారికి మేము అండగా ఉన్నామని చెప్పడానికే పాదయాత్ర చేస్తున్నానని వెల్ల‌డించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు. పాదయాత్రలో ప్రజలకు ధైర్యం చెబుతామ‌న్నారు. 2023- 24 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తెలంగాణ లక్ష్యాలను నెరవేరుస్తామ‌న్నారు.

దేశంలో గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తున్నదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బిజెపి కుప్ప కూల్చిందన్నారు. ప్రధాని తన స్నేహితులైన క్రోనీ క్యాపిటల్ లిస్టులకు ఈ దేశ సంపదను దోచిపెడుతున్నారని మ‌ల్లు దుయ్య‌ట్టారు. ఈ దేశాన్ని కాపాడటానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారని వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీ భావజాలమే దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయ మార్గం అని ఇంటింటికి చెప్తామ‌న్నారు.

ఏఐసిసి అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం సీఎల్పీ నాయకుడిగా తెలంగాణలో పాదయాత్ర చేయడానికి మీ ముందుకు వస్తున్నానని, మీశక్తి మేరకు నాతో అడుగులు వేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి బలోపేతం చేయాలని పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని ప్రజలకు చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మన అడుగులు ఉపయోగపడాలని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్న అని మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

ప్రగతిశీలవాదులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, కళాకారులు, తెలంగాణ కోసం పోరాడిన యోధులు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు జరిగే త‌న పాదయాత్రలో భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయ‌న విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఏఐసిసి కార్యక్రమాలు అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తదితరులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like