ప్రాణహిత పుష్కారాలకు నిధులు ఇవ్వండి
అసెంబ్లీలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్
![](https://naandinews.com/wp-content/uploads/2022/03/Screenshot_2022-03-13-21-14-22-57-750x430.jpg)
త్వరలో ప్రాణహిత పుష్కారాలు జరగనున్న నేపథ్యంలో నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. శనివారం నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనుల నిధుల విషయమై అసెంబ్లీ వేదికగా సంబంధిత శాఖల మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏప్రిల్ 13 నుంచి 24 వరకు జరిగే ప్రాణహిత పుష్కరాల ముందస్తు ఏర్పాట్లకు సంబంధించి నిధులు అందించాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేయవలసిన ఘాట్లు, రోడ్లు, లైటింగ్, స్నానపు గదుల వసతి వంటి తదితర పనులు నిర్ధేశిత సమయం లోపు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ఇదివరకే క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. జైపూర్ మండలం లోని ప్రఖ్యాత శైవక్షేత్రం వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయం, కోటపల్లి మండలం లోని కాలభైరవ స్వామి ఆలయం, గాంధారి మైసమ్మ ఆలయం, రామకృష్ణాపూర్ పట్టణం RK 1A సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు.నూతన రోడ్ల నిర్మాణానికి అడ్డంకిగా మారుతున్న అటవీ అనుమతులు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అవసరమున్న గ్రామాల్లో ఎఫ్ ఆర్ సి కమిటీలు ఏర్పాటు చేసి పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని సభ వేదికగా విజ్ఞప్తి చేశారు.