సింగరేణి ప్రైవేటీకరణ సాధ్యం కాదు
-తెలంగాణ ఎంపీల ఆరోపణ నిరాధారం
-బొగ్గు వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే
-పార్లమెంట్ లో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి
![](https://naandinews.com/wp-content/uploads/2022/12/316532984_686626346160692_3280813789961140720_n-750x430.jpg)
privatization-of-singareni-is-not-possible: సింగరేణి ప్రైవేటీకరణ సాధ్యం కాదని పార్లమెంట్ లో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంట్లో బుధవారం టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణపై జీరో అవర్ లో ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. తెలంగాణ ఎంపీల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు.
సింగరేణి కాలరీస్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51శాతం ఉన్నప్పుడు 49 శాతం వాటా కలిగిన కేంద్రం ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదన్నారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్న వేలం ప్రక్రియపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని ఆయన స్పష్టం చేశారు.
వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుపుతున్న రాష్ట్రాలకే ప్రయోజనం కలుగుతుందని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దీంతో అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కానప్పటికీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా వేలం పద్ధతితో ముందుకు సాగుతున్నాయని అన్నారు. వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళ్తుందన్నారు. బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.