రోజుకు 2.2 లక్షల టన్నుల ఉత్పత్తి
-15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలి
-జీఎంల సమీక్షా సమావేశంలో సంస్థ డైరెక్టర్ల పిలుపు
![](https://naandinews.com/wp-content/uploads/2022/10/Screenshot_2022-10-01-19-22-50-65_f598e1360c96b5a5aa16536c303cff92-750x430.jpg)
Production of 2 lakh tonnes per day at Singareni: తీవ్ర వర్ష ప్రభావంతో మూడు నెలలుగా ఉత్పత్తి కుంటు పడిన నేపథ్యంలో అక్టోబరు నెలలో రోజుకు కనీసం 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్), బలరామ్(ఫైనాన్స్, పి అండ్ పి), సత్యనారాయణరావు (ఈ అండ్ ఎం) జీఎంలను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్పత్తిపై అన్ని ఏరియాల జీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ రోజుకు 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలని స్పష్టం చేశారు. ఈ ఏడాదికి సింగరేణి 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో తొలి అర్ధ సంవత్సరంలో వర్షాల కారణంగా కొంత వెనకబడినా ఆ లోటును భర్తీ చేస్తూ ప్రతీ నెలకు నిర్దేశించిన లక్ష్యాలు సాధించాల్సిన అవసరం ఉంద న్నారు.
యంత్రాలను పూర్తి స్థాయి పని గంటలు వినియోగించుకొని ఉత్పాదకతను పెంచాలన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ( కోల్ మూమెంట్) జె.అల్విన్ మాట్లాడుతూ.. బొగ్గు రవాణాకు రైల్వే సహకారంతో రోజుకు 38 రేకుల ద్వారా రవాణా జరిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి అనుగుణంగా ఏరియాల వారీ గా బొగ్గును అందించాలని సూచించారు. జీఎం(కో ఆర్డినేషన్) సూర్యనారాయణ మాట్లాడుతూ గడచిన ఆరు నెలల్లో ఏరియాల వారీగా గనులు సాధించిన ప్రగతిని, సాధించాల్సిన లక్ష్యాలను వివరించారు. గత ఆరు నెలల్లో 29.23 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 29.46 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సాధించామని, 176 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించినట్లు వివరించారు. సమావేశంలో జీఎం(సీపీపీ) సీ హెచ్ నరసింహారావు, జీఎం(మార్కెటింగ్) ఎం.సురేశ్, కార్పోరేట్ జీఎంలు, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.