రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌మాదం గుర్తుకు వ‌స్తోంది..

త్రివిధ దళాల స్పెషల్​ ఆఫీసర్​ బిపిన్​ రావత్​ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ ప్రమాదంతో గతంలో జరిగిన దివంగత సీఎం వైఎస్సార్​ హెలికాప్టర్​ ప్రమాద ఘటన గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు కూడా సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ ఎత్తైన గుట్టలమీదుగా అటవీ ప్రాంతంలో వెళ్తుండగానే ప్రమాదానికి గురయ్యింది. 2009 సెప్టెంబర్ 2వ తేదీ చిత్తూరు జిల్లాలో జరిగే రచ్చబండలో పాల్గొనేందుకు సీఎం రాజశేఖరరెడ్డి ఉదయం 8.38 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం 10.30 గంటలకల్లా ఆయన చిత్తూరు జిల్లాకు చేరుకోవాల్సి ఉంది. కానీ, చేరుకోలేదు. హెలికాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని, సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ లభించడం లేదని అధికారుల‌కు వార్త‌లు అందాయి.

మధ్యాహ్నానికి ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. హెలికాప్టర్ మిస్సయ్యిందని, ముఖ్యమంత్రి ఆచూకీ లభించడం లేదని, గాలింపు చర్యలు చేప్టటామని. హెలికాప్టర్‌లో సీఎం రాజశేఖరరెడ్డితో పాటు సీఎంఓ ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సీఎం ప్రధాన భద్రతాధికారి ఏఎస్‌సీ వెస్లీ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించటం లేదన్న వార్త జాతీయ స్థాయిలో సంచలనమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు జిల్లాలను అప్రమత్తం చేసి, గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పోలీసు, సీఆర్‌పీఎఫ్, యాంటీ నక్సల్ విభాగాల బలగాలు నల్లమల అడవుల్లోకి వెళ్లాయి. సికింద్రాబాద్, బెంగళూరు నుంచి ఆర్మీ హెలికాప్టర్లు సైతం రంగంలోకి దిగాయి. థర్మల్ ఇమేజింగ్ సామర్థ్యం ఉన్న సుఖోయ్ విమానాన్ని కూడా పంపించారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కూడా ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. అయితే, వాతావరణం అనుకూలించక పోవడంతో హెలికాప్టర్లు వెనక్కు వచ్చేశాయి.

హెలికాప్టర్ కూలిన ప్రదేశం కొండ శిఖరాగ్రం. హెలికాప్టర్ కొండను ఢీ కొట్టి ముక్కలయ్యింది. తోక భాగం ఒకచోట, రెక్కలు ఒకచోట, ఇంజిన్ మరొకచోట పడ్డాయి. మిగతావన్నీ ముక్కలు చెక్కలయ్యాయి. ఇంజిన్ కాలిపోయింది. ఇంజిన్‌కు సమీపంలోనే సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మృతదేహం పడింది. బట్టతల, పంచె ఆధారంగా ఆయన్ను గుర్తు పట్టారు. తోకభాగం పడ్డచోట ఇద్దరు పైలట్లు, వారికి దూరంగా కుడివైపున భద్రతాధికారి వెస్లీ, వీరందరికీ కిందగా సుబ్రహ్మణ్యం మృతదేహాలు ఉన్నాయి. ఒక పైలట్ మృతదేహం సీటుకే ఉందని అధికారులు చెప్పారు. ఇలా ఆ హెలిక్టాప‌ర్ కూడా కొండ శిఖ‌ర‌భాగంలో కూలింద‌ని తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రల ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like