ల‌క్ష్యం చేరుకోవాలే

మార్చి నాటికి 720 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా ముందుకు పోవాలి
లక్ష్యాలు సాధిస్తే ఈ ఏడాది 40 వేల కోట్ల టర్నోవర్, రూ.3500 కోట్ల లాభాలు
తొలి అర్ధ సంవత్సరంలో బొగ్గు రవాణాలో12 శాతం, ఉత్పత్తి లో 7శాతం, ఓబీ తొలగింపులో 15 శాతం వృద్ధి
ఇకపై రోజుకు 2.1 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలి
రోజూ 14.65 లక్షల క్యూబిక్ మీటర్ల ఓర్డెన్ తొలగింపు లక్ష్యం
అన్ని ఏరియాల జీఎంలకు సింగ‌రేణి సీఅంండ్ ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్‌ దిశా నిర్దేశం

Singareni: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతోంద‌ని, అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలిన ఆరు నెలల కాలంలో ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌ని సింగ‌రేణి సీఅంండ్ ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ పిలుపునిచ్చారు.మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి పై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరునెలల కాలంలో వర్షాల వల్ల కొంత ఇబ్బంది కలిగినా, అన్ని రకాల అవరోధాలను అధిగమిస్తూ బొగ్గు రవాణాలో 12 శాతం వృద్ధిని, బొగ్గు ఉత్పత్తిలో 7 శాతం వృద్ధి, ఓవర్ బర్డెన్ తొలగింపులో దాదాపు 15 శాతం వృద్ధి సాధించటం పై ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన‌ ఆరు నెలల కాలం కీలకమైందన్నారు. బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ వస్తోందని, అన్ని ఏరియాలకు అవసరమైన యంత్రాలు అనుమతులు, ఓబీ కాంట్రాక్టులు ఇప్పటికే సమకూర్చిన‌ట్లు వెల్ల‌డించారు. వర్షప్రభావం కూడా ఉండే అవకాశం లేదని, అందుకే రానున్న వారం రోజుల్లోగా ఓపెన్ కాస్ట్ క్వారీలలో నిలిచి ఉన్న నీటిని బయటకు తోడి పోయాల‌న్నారు. బొగ్గు ఉత్పత్తిని, ఓవర్ బర్డెన్ తొలగింపును ఇచ్చిన లక్ష్యాల మేర విధిగా సాధించాలని కోరారు. దీనికోసం ఏరియా స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు పోవాలని ఆయన జీఎంలను ఆదేశించారు.

అన్ని ఏరియాలు తమకు ఇచ్చిన లక్ష్యాలు సాధిస్తే ఈ ఏడాది నిర్దేశిత 720 లక్షల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి ,రవాణా చేసే అవకాశం ఉందన్నారు. తద్వారా రూ.40 వేల కోట్ల టర్నోవర్, సుమారు 3500 కోట్ల రూపాయల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. సింగరేణి ఉద్యోగులకు గతం లో ఎన్నడూ లేని విధంగా ఒకే దఫా రూ రూ.1750 కోట్లు వేజ్ బోర్డు ఏరియర్సు చెల్లించామని, ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా 32 శాతం లాభాల బోనస్ మొత్తం రూ. 711 కోట్లు కూడా దసరా పండుగకు ముందే విడుదల చేయనున్నామని ప్రకటించారు. దీపావళి బోనస్ కూడా ఆ పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామ‌న్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మాసాంతానికి సింగరేణి బొగ్గు ఉత్పత్తి, రవాణాలో నిర్దేశిత లక్ష్యాలను సాధించింది. ఈ అర్థ సంవత్సరానికి బొగ్గు రవాణా లక్ష్యం 307 లక్షల టన్నులు కాగా సింగరేణి ఈ లక్ష్యాన్ని దాటి 330 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపి 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలానికి సాధించిన బొగ్గు రవాణా (294 లక్షల టన్నులు)తో పోల్చి చూస్తే ఇది 12 శాతం అధికం. ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సర బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 314 లక్షల టన్నులను సాధించి నూరు శాతం లక్ష్యసాధన తో నిలిచింది. గత ఏడాది ఇదే కాలానికి సాధించిన బొగ్గు ఉత్పత్తి (292 లక్షల టన్నులు)తో పోల్చి చూస్తే 7.15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. కాగా ఓవర్ బర్డెన్ తొలగింపులో గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి సాధించిన 171.30 లక్షల క్యూబిక్ మీటర్ల కన్న మిన్నగా ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 14.84 శాతం వృద్ధితో 196.72 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను సింగరేణి సంస్థ సాధించింది.

సమావేశంలో డైరెక్టర్లు బలరామ్ (పర్సనల్, ఫైనాన్స్), సత్యనారాయణ రావు (ఈఅండ్ఎం), ఎన్వికె శ్రీనివాస్ (ఆపరేషన్స్), వెంకటేశ్వర్ రెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఆల్విన్, జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) ఎం.సురేష్, జీఎం(సీపీపీ) జక్కం రమేష్, జీఎం(ఎంపీ) మల్లెల సుబ్బారావు, జీఎం(మార్కెటింగ్) దేవేందర్, జీఎం(సీఎంసీ) మోహన్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like