స‌మ‌రానికి సై…

-ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ నిర‌స‌న‌
-కేటీఆర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం
-బీజేపీ నేత‌ల అంతు చూస్తామ‌ని వెల్ల‌డి

ఉగాది త‌ర్వాత ఉగ్ర‌రూప‌మే అని ప్ర‌క‌టించిన తెలంగాణ రాష్ట్ర స‌మితి అన్న‌ట్లుగానే కేంద్రంతో స‌మ‌రానికి సిద్ద‌మైంది. ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, దీక్షలు చేపట్టనున్నారు.

ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. ఇక కేంద్రంతో సమరమేనని.. తాడోపేడో తేల్చుకుంటామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ భవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గత యాసంగికి ముందే వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర మంత్రులను కలిసి విన్నవించామని కేటీఆర్ అన్నారు. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, పలువురు నేతలు ఢిల్లీ వెళ్లి మంత్రులను కలిశారని చెప్పారు. బాయిల్డ్ రైస్ తీసుకోమని కేంద్ర చెప్పిందని.. బాయిల్డ్, రా రైస్ అంటూ వేరు చేయొద్దని.. ధాన్యం మొత్తం కొనుగోలు చేయాల్సిందేనని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. అందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అంగీకరించకపోవడంతో రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో యాసంగి వరి సాగు చేయొద్దని మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారని చెప్పారు.

ప్రతి గింజ కేంద్రం కొనుగోలు చేస్తుందని.. వరిసాగు చేయాలని గల్లీ బీజేపీ నేతలు ప్రగల్బాలు పలకడడంతో నమ్మి సాగు చేశారని కేటీఆర్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ ధాన్యం కొనుగోలు చేయిస్తామని చెప్పారని.. ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం చెబుతోందన్నారు. ఆ ధాన్యం ఎవరు కొనుగోలు చేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం నిరసన తెలియజేశారని.. డిమాండ్ చేసిన ప్రతిసారీ బీజేపీ నేతలు ప్రతి గింజ కొనిపిస్తామన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఇక కేంద్ర ప్రభుత్వంపై పోరుబాట పట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 4న అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపడుతుందన్నారు. 6న ముంబై, నాగపూర్, విజయవాడ, బెంగళూరు జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేస్తామన్నారు. 7న అన్ని జిల్లా కేంద్రాల్లో వేలాది మంది రైతులతో నిరసన కార్యక్రమాలు చేపడతామని.. 8న ప్రతి రైతు తన ఇంటిపై నల్లజెండా ఎగరేసి నిరసన తెలపాలన్నారు. 11న ఢిల్లీలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నిరసన దీక్ష చేపడతారని.. ఎంపీలు పార్లమెంట్‌లో మాట్లాడతారని కేటీఆర్ వెల్లడించారు.

కేంద్రంలో తలా తోకా లేని ప్రభుత్వం వుందని.. కార్పోరేట్లకు వత్తాసు పలుకుతుందని కేటీఆర్ ఆరోపించారు. రైతులపై ఏమాత్రం ప్రేమలేని ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. కిషన్ రెడ్డి ఒక పనికి మాలిన మంత్రి.. బండి సంజయ్ ఒక దౌర్భాగ్యడు అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.పీయూష్ గోయల్ ది కండకావరమని, బీజేపీ నాయకుల అంతు చూస్తామని ఆయన హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like