సంత్ సేవాలాల్ ఆశయాలు ఆదర్శనీయం
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
![](https://naandinews.com/wp-content/uploads/2023/02/DSC_5756_1600x1067-750x430.jpg)
Mancheriyal: సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయాలు ఆదర్శనీయమని, ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో ఆచరించదగినవని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మార్గం ఆదర్శనీయమన్నారు. సేవాలాల్ ఆచరించి మార్గాన్ని ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో అమలు చేస్తేనే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని తెలిపారు. ఉన్నత అంశాలను ఆదర్శంగా తీసుకొని, ఆచరించి జీవించిన గొప్ప వ్యక్తి సేవలాల్ అని అన్నారు. రెండు వందల సంవత్సరాలు దాటినా సేవాలాల్ మహారాజ్ను స్మరించుకుంటున్నామన్నారు. అహింసామార్గాన్ని అవలంభించాలని, మహిళలను గౌరవించాలని సేవాలాల్ చేసిన బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నుండి ఎఫ్.సి.ఎ. కమ్యూనిటీ హాల్ వరకు సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి.మధుసూదన్ నాయక్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, సేవాలాల్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.