ఆస్పత్రిలో కేసీఆర్ సతీమణి శోభ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆమె పోస్ట్ కొవిడ్ ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నారు. వైద్య పరీక్షల కోసం శుక్రవారం ఆమె ఢిల్లీకి వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్‌, క‌విత కూడా వెళ్లారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం శోభకు పలురకాల టెస్టులు నిర్వహించారు. వాటి ఫలితాలను విశ్లేషించిన డాక్టర్లు.. ఇన్ పేషెంట్ గా ఆస్పత్రిలో చేరాలని శోభకు సూచించారు. వాస్తవానికి వైద్యపరీక్షల అనంతరం శనివారమే హైదరాబాద్ తిరిగి రావాల్సి ఉంది. కానీ, డాక్టర్ల సూచనతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లారు. దీంతో సీఎం కుటుంబమంతా ఢిల్లీకి చేరింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే కేసీఆర్ నేరుగా ఎయిమ్స్ కు వెళ్లి భార్యను కలుస్తారని తెలుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో సీఎం కేసీఆర్ కు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ వెంటనే ఆయన భార్య శోభకు కూడా వైరస్ సోకింది. కూతురు కవిత, కొడుకు కేటీఆర్ కూడా కరోనా బారినపడ్డారు. మిగతా ముగ్గురూ కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. శోభమ్మకు మాత్రం ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది. హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లో చూయించినా, డాక్టర్ గులేరియాను కలవడమే ఉత్తమం అనే సలహా రావడంతో వారు ఢిల్లీ ఎయిమ్స్ వెళ్లారు. అయితే ఆమెకు ఉన్న సమస్య చిన్నదేనని, ఒక‌టి, రెండు రోజులు డాక్ట‌ర్ల ప‌రిశీల‌న త‌ర్వాత‌ ఎయిమ్స్ వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేయ‌నున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like