కాలుష్య నివారణకు సింగ‌రేణి భారీ ప్రాజెక్టు

-రూ. 696 కోట్లతో ఎస్టీపీపీలో నిర్మాణం
-రాష్ట్రంలో నిర్మిస్తున్న తొలి ఎఫ్‌జీడీ ప్రాజెక్టు ఇదే
-గడువులోపు పనులు చేయాలని సీఅండ్ఎండీ ఆదేశాలు

Singareni: పర్యావర‌ణానికి పెద్దపీట వేస్తున్న సింగరేణి సంస్థ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా సంపూర్ణ కాలుష్య రహిత కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తోంది. దీనికి సంబంధించి భారీప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. రూ.696 కోట్లతో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) అనే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాల రాష్ట్రంలో నిర్మిస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

బూడిద 100 శాతం వినియోగం..
సాధారణంగా థర్మల్ పవర్ ప్లాంట్‌లలో బొగ్గును మండించి, దాని ద్వారా వెలువడే ఉష్ణోగ్రతతో నీటిని ఆవిరి రూపంలోకి మార్చి, దానితో టర్బైన్లను తిప్పుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. బొగ్గును మండించడం ద్వారా వెలువడే బూడిద, విషవాయువులను శుద్ధి చేసే ప్రక్రియ చేపడతారు. బొగ్గు మండించగా వెలువడే వాయువులోనే ఉండే బూడిద దాదాపు 100శాతం గాలిలో కలవకుండా చూస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రెసిపిటేటర్ విభాగంలో సమకూరిన బూడిదను ఫ్లై యాష్ అంటారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ విధంగా ప్రతి ఏడాది విడుదలయ్యే ఫ్లైయాష్‌ నూటికి నూరు శాతం సిమెంటు తదితర పరిశ్రమలకు సరఫరా చేస్తూ జాతీయస్థాయిలో ‘బెస్ట్ ఫ్లై యాష్ యుటిలైజేషన్ అవార్డు’ రెండుసార్లు అందుకుంది.

ఎఫ్‌జీడీ ప్లాంట్ ఎందుకంటే..
అలాగే పర్యవరణశాఖ ఇచ్చిన నిబంధనల మేరకు శుద్ధిచేసిన వాయువు థర్మల్ ప్లాంట్ చిమ్నీ ద్వారా విడుదల చేస్తున్నారు. బయటకు పంపే వాయువు మరింత శుద్ధి చేయాలని, 2015లో కేంద్ర పర్యావరణ అటవీశాఖ కొత్త ఉత్వ‌ర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సల్ఫర్ ఆక్సైడ్ శాతం ఘనపు మీటర్‌కు 2000 మిల్లీ గ్రాములు ఉండగా దీనిని 200 మిల్లీ గ్రాములకు కుదిస్తూ కొత్త నిబంధన విధించారు. ఈ నిబంధనకు అనుగుణంగా దేశంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల తమ తమప్లాంట్లకు అనుబంధంగా ఎఫ్‌జీడీ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో తొలిగా స్పందించిన సింగరేణి
దీనిపై సింగరేణి సంస్థ తక్షణమే స్పందిస్తూ రూ.696 కోట్లతో ఈ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు చెందిన పి.ఈ.ఎస్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేప‌ట్టింది. ఇప్పటికే 20% పనులను పూర్తి చేసింది . సంస్థ సీఅండ్ ఎండీ దీని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిర్మాణ ఏజెన్సీలకు పూర్తి సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో యూనిట్ ఒకటికి సంబంధించిన ఎఫ్‌జీడీని 2024 జూన్ కల్లా పూర్తి చేయాలని, రెండవ యూనిట్‌కు సంబంధించిన నిర్మాణాన్ని అదే ఏడాది సెప్టెంబర్‌లోపు పూర్తి చేయాలని ఆయన కాలపరిమితిని నిర్దేశించారు.

ఎఫ్‌జీడీతో వాయు శుద్ధి ప్రక్రియ ఇలా ఉంటుంది
బొగ్గు మండించగా వచ్చే వాయువులో దాగి ఉన్న సల్ఫర్ అనుబంధ వాయువులను వేరు చేస్తారు. దీనికోసం 150 మీటర్ల ఎత్తయిన ఒక చిమ్నీ ఏర్పాటు చేస్తారు. చిమ్నీలో కింది నుండి పైకి వచ్చే వాయువుపై కాల్షియం కార్బోనేట్ (తడి సున్నం)ను పై నుంచి బలంగా పంపిస్తారు. తద్వారా బొగ్గు మండించిన వాయువుల్లో ఉన్న సల్ఫర్ డయాక్సైడ్‌తో తడి సున్నంతో రసాయనిక చర్య జరిగి, ఉన్న సల్ఫర్ అనుబంధ వాయువులన్నీ తడి సున్నం లోకి పీల్చుకోబడతాయి. తత్ఫలితంగా బయటకు విడుదల చేస్తున్న వాయువులలో సల్ఫర్ అనుబంధ వాయువుల శాతం ఘనపు మీటరుకు 200 మిల్లీ గ్రాములలోపే ఉంటుంది. ఈ రసాయనిక ప్రక్రియలో అంతిమంగా కాల్షియం సల్ఫేట్ అనే ఘన పదార్థం ఏర్పడుతుంది. దీనినే జిప్సం అంటారు.

జిప్సం అమ్మ‌కంతో ఆదాయం…
ఈ ప్రక్రియలో వెలువడే జిప్సం, ఎరువులు, సిమెంటు, పేపర్, వస్త్ర పరిశ్రమ, నిర్మాణరంగంలో కూడా విశేషంగా వినియోగిస్తున్నారు. కనుక పర్యావరణహిత చర్యగా ఏర్పాటు చేసిన ఈ ఎఫ్‌జీడీ తదుపరి కాలంలో జిప్సం అమ్మకం ద్వారా ప్లాంటు నిర్వహణ ఖర్చులకు కొంతమేర తోడ్పడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పనుల ప్రగతిని సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సమీక్షించారు. సమావేశంలో డైరెక్టర్‌ ఈఅండ్ఎండి సత్యనారాయణ రావు, జీఎం. కోఆర్డినేషన్ ఎం. సురేష్‌, చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజయ్ కుమార్ సూర్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ డి.ఎస్. సూర్యనారాయణ రాజు, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్.వి.కె. విశ్వనాథరాజు, సివిల్ ఏజీఎం ప్రసాద్, ఎఫ్‌జీడీ ప్రాజెక్ట్ ఇన్చార్జి శ్రీనివాసులు, కన్సల్టెంట్ (ఎన్టిపిసి) సోహైల్ ఖాన్, నిర్మాణ ఏజెన్సీ (పిఈఎస్) ఎండి వాసుదేవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like