యూనియన్ బ్యాంక్ తో సింగరేణి కీలక ఒప్పందం

-సింగరేణిలో రూ. 55 లక్షల ఉచిత ప్రమాద బీమా
-సూపర్ శాలరీ అకౌంటు కార్మికులందరికీ వర్తింపు
-ఉద్యోగి పదవీ విరమణ అనంతరమూ వర్తించేలా ఒప్పందం
-రూ. 315 కడితే మరో 30 లక్షల ప్రమాద బీమా వర్తింపు
-గృహ నిర్మాణ, విద్యా రుణాలలో రాయితీలు
-ఉచిత చెక్ బుక్, అపరిమిత ఏటీఎం సేవలు
-కార్మికులకు మేలు చేసేందుకే యూనియన్ బ్యాంకు తో ఒప్పందం
-సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్. బలరామ్

Singareni: సింగరేణి యాజమాన్యం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ‌ధ్య గురువారం కీల‌క ఒప్పందం కుదిరింది. సింగరేణి వ్యాప్తంగా యూనియన్ బ్యాంకు లో ప్రస్తుతం ఖాతాలు ఉన్న11,182 మంది సింగరేణి కార్మికుల ఖాతాలను ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా సూపర్ శాలరీ అకౌంట్లుగా మార్చాలని నిర్ణయించారు. తద్వారా ప్రతి కార్మికునికి ఉచితంగా 55 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయనున్నారు. నెలకు కనీసం రూ. 25 వేల నుంచి రూ.75 వేల జీతం పొందుతున్న ఉద్యోగులకు, అంతకు పైబడి జీతం ఉన్న‌ వారికి ఇది వర్తిస్తుంది. దీనిలో సూపర్ శాలరీ అకౌంటు ఉన్నందుకు 40 లక్షల ఇన్సూరెన్స్ పథకం, 5 లక్షల బ్యాంక్ ఇన్సూరెన్స్ తో పాటు ఏటీఎం రూపే కార్డు ఇన్సూరెన్స్ ద్వారా 10 లక్షల రూపాయలు మొత్తం కలిపి 55 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం కింద చెల్లిస్తారు. ఉద్యోగి 315 రూపాయల సాధారణ ప్రమాద ఇన్స్రెన్స్ స్కీమ్ కింద వార్షిక ప్రీమియమ్ చెల్లిస్తే ఆ పథకం కింద అదనంగా 30 లక్షల ప్రమాద బీమా సొమ్ము చెల్లించనున్నారు.

ప్ర‌మాద బీమాతో పాటు 22 ర‌కాల అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు..
ఈ ప్రమాద బీమా సౌకర్యంతో పాటు మరో 22 రకాల అదనపు ప్రయోజనాలు కల్పించనున్నారు. ఏడాదికి మెడిక్లెయిమ్ ఆసుపత్రి ఖర్చుల కింద 15 వేల రూపాయలు చెల్లింపులు, ఉచిత చెక్ బుక్ సౌకర్యం, బ్యాంకు లాకర్స్ వినియోగంలో 25 నుండి 50 శాతం రాయితీ, రూ.25 లక్షలు అంతకన్నా పైబడి తీసుకునే రుణాలకు పూర్తి శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, రూ. 25 లక్షల కన్నా తక్కువ రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజులో సగం రాయితీ, గృహ నిర్మాణానికి సింగరేణి కార్మికులు తీసుకునే రుణంపై రాయితీ, వ్యక్తిగత రుణం, వాహన రుణం, విద్యా రుణాల పైన రాయితీలు, ఏటీఎం కార్డు వినియోగంలో రాయితీల వంటి అనేక ప్రయోజనాలు కలిగించే విధంగా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద రాయితీలు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా 70 సంవత్సరాల వయస్సు వరకు అమలు చేయటానికి అంగీకరించారు. దీనివల్ల రిటైర్డ్ కార్మికులు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది.

కార్మికుల ప్రయోజనమే ప్రధానం : డైరెక్టర్ ఫైనాన్స్, పా ఎన్. బలరామ్
సింగరేణి సంస్థ కార్మికులకు, ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా ప్రతినెల దాదాపు 300 కోట్ల రూపాయల వేతనాలు చెల్లిస్తున్నాం. బ్యాంకుల ద్వారా ఏడాదికి 30 వేల కోట్ల టర్నోవర్ నిర్వహిస్తున్న‌ది. బ్యాంకుల ద్వారా ఉద్యోగులకు మరిన్ని రాయితీలు కల్పించడం కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నాం. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో ఒప్పందం జరిగిందని, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ తో జరిగిన ఒప్పందం కూడా ఎంతో మేలైనది. కార్మికులకు అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు వారి కుటుంబాలను కంపెనీ తరుపున ఆదుకోవడంతో పాటు బ్యాంకుల నుండి కూడా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తింపజేయడం వల్ల ఆ కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇటీవల శ్రీరాంపూర్ లో ఒక కార్మికుడు చనిపోగా అతని కుటుంబానికి 74 లక్షల రూపాయలను బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ పథకం కింద చెల్లించిన‌ట్లు తెలిపారు. గత ఏడాది కాలంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 8 మంది ఉద్యోగులకు కంపెనీ విజ్ఞప్తి మేరకు రూ.3.5 కోట్ల ప్రమాద బీమా పరిహారాన్ని యూనియన్ బ్యాంక్ అందజేసిందని తెలిపారు. సంస్థ ఛైర్మన్ ఆదేశం మేరకు కార్మిక సంక్షేమానికి వారి ప్రయోజనాలకి మరిన్ని మంచి పథకాలను అమలు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

50 ఏండ్లుగా సింగ‌రేణి ప్రాంతంలో సేవ‌లు : చీఫ్ జనరల్ మేనేజర్ కారే భాస్కరరావు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ కారే భాస్కరరావు మాట్లాడుతూ ఆంధ్రబ్యాంకు పేరుతో తాము 50 ఏళ్లుగా సింగరేణి ప్రాంతంలో సేవలందిస్తున్నామన్నారు. సింగరేణి ప్రాంతంలో చాలా శాఖలు ఉన్నాయని, గృహ రుణాలు, విద్యా రుణాలు ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ యూనియన్ బ్యాంకు నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. సింగరేణి ఉద్యోగుల ఖాతాలను సూపర్ శాలరీ అకౌంట్లుగా మార్చడం, నిర్వహించడం కోసం హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సింగరేణి సంస్థ నుండి జనరల్ మేనేజర్ వెల్ఫేర్, రిక్రూట్మెంట్ కె.బసవయ్య, ఎస్ఓటు డైరెక్టర్ పర్సనల్ ప్రకాశ్ రావు, పర్సనల్ మేనేజర్ ముకుంద సత్యనారాయణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జనరల్ మేనేజర్ పి. కృష్ణన్, రీజనల్ హెడ్ డి.అపర్ణ రెడ్డి, డీజీఎం గవర్నమెంట్ బిజినెస్ ఐ.రవి కృష్ణ, రీజినల్ హెడ్ అరుణ్ కుమార్, ఏజీఎం చంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like