సింగ‌రేణికి మ‌రో ప్రతిష్టాత్మక అవార్డు

న్యూ ఢిల్లీ : బొగ్గు మైనింగ్ రంగంలో 13 దశాబ్దాల అనుభవం ఉన్న సింగరేణి సంస్థ అవలంబిస్తున్న అత్యుత్తమ వ్యాపార విలువలకు జాతీయ స్థాయిలో మరో పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (ఐఈఐ) ఏటా ప్రకటించే ఇండస్ట్రీ ఎక్స్ లెన్స్ అవార్డు కోసం ఈ ఏడాది సింగరేణిని ఎంపిక చేసింది. ఐఈఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆదివారం ప్రారంభమైన 36వ ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ లో ఈ అవార్డు ప్రదానం చేశారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య‌ అతిథిగా వ‌చ్చిన‌ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే చేతుల మీదుగా సింగరేణి ఛైర్మన్ జీఎం(సీపీపీ) కె.నాగభూషణ్ రెడ్డి ఈ అవార్డు స్వీకరించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐఈఐ అధ్యక్షుడు నరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. శ్రేష్టమైన వాణిజ్య విలువలు పాటిస్తున్నందుకు సింగరేణి ని అవార్డు కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అవార్డును స్వీకరించిన తర్వాత జీఎం(సీపీపీ) కె.నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ నేతృత్వంలో సింగరేణి కాలరీస్ కేవలం బొగ్గు మైనింగ్ రంగంలోనే కాకుండా 1200 మెగావాట్ల థర్మల్, 300 మెగావాట్ల సోలార్ రంగాల్లోకి విజయవంతంగా అడుగుపెట్టిందన్నారు. ఆయన సారథ్యంలో కంపెనీకి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయన్నారు. మున్ముందు సంస్థ సీఅండ్‌ఎండీ మార్గనిర్దేశంలో దేశ సేవకు మరింత పునరంకితమై పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సింగరేణి రెసిడెంట్ ఆఫీసర్ ఓజా, ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ దినేశ్ కుమార్, ఐఈఐ కి చెందిన డాక్టర్ హెచ్.వో.థాకరే, మేజర్ జనరల్ ఎంజెఎస్ సైలీ, ఆర్.ఎన్.రాజ్ పుత్, ప్రవీణ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఏడేళ్ల లో సింగరేణికి అవార్డుల పంట…
గత ఏడేళ్ల లో సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్.శ్రీధర్ సారథ్యంలో ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణాలతో పాటు లాభాలలో సింగరేణి రికార్డులు సృష్టించింది. అలాగే కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వేసింది. సంస్థ సాధించిన ప్రగతి, అభివృద్ధిని గుర్తిస్తూ జాతీయ అంతర్జాతీయ సంస్థలు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశాయి. వీటి లో ఆసియా పసిఫిక్ ఎంటర్ ప్రెన్యూ ర్ షిప్ అవార్డు, అవుట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు, ఎక్స్ లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్, బెస్ట్ మేనేజ్ మెంట్ అవార్డు, ఏసియాస్ మోస్ట్ ట్రస్ట్ డ్ కంపెనీ అవార్డు, ఎక్స్ లెన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ అవార్డు, పర్యావరణ హిత చర్యలకు గుర్తింపుగా గోల్డెన్ పీకాక్ వారి ఇన్నో వేటివ్, సీఎస్ఆర్ తదితర అవార్డులు ఉండటం విశేషం. సంస్థ సాధిస్తున్న ప్రగతికి జాతీయ స్థాయిలో అవార్డులు వస్తుండటం పై సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like