సింగరేణి మూసివేతకు కుట్ర
కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
![](https://naandinews.com/wp-content/uploads/2022/02/telangana-MP-Kavitha-Singareni-Coal-Mines-Workers-Protest.jpg)
మంచిర్యాల : సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం పై ట్విట్టర్ లో ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోందన్నారు. సింగరేణిలో రాష్ట్రానికి 51%,కేంద్రానికి 49% వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందన్నారు. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి విరుద్దమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతితో,దేశంలోని ఇతర సంస్థల కంటే ఎంతో గొప్పగా లాభాలు సాధించిందని చెప్పారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ, నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందని దుయ్యబట్టారు. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే వరకూ,కార్మికుల పక్షాన గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని కవిత స్పష్టం చేశారు.