సింగరేణి ప్రైవేటీకరణ అసాధ్యం…
-ఇదంతా టీఆర్ఎస్ దుష్ప్రచారమే... -కార్మికులారా... టీఆర్ఎస్ మాటలు నమ్మకండి -సింగరేణిలో మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే.. -రాష్ట్రం ఆమోదం లేకుండా ప్రైవేటీకరణ మాటే ఉత్పన్నం కాదు -కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాసిన లేఖ విడదల చేసిన బండి సంజయ్
![](https://naandinews.com/wp-content/uploads/2022/03/webp-2-750x430.webp)
మంచిర్యాల : సింగరేణి ప్రైవేటీకరణ అనేది సాధ్యమే కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో అబద్దం… రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు. తన జిత్తుల మారి ఎత్తులతో రైతులను, విద్యార్థులను, కార్మికులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులను నట్టేట ముంచిన కేసీఆర్… తాను చేసిన తప్పిదాలను కేంద్రంపై మోపి బీజేపీని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
తెలంగాణ కొంగు బంగారం…. నల్లబంగారానికి నెలవైన సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందంటూ విష ప్రచారానికి తెరదీస్తూ సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. సింగరేణి ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఆడే అబద్దాలకు అంతూ పొంతు లేకుండా పోయిందన్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు…అన్నట్లుగా సిగ్గులేకుండా పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని దుయ్యబట్టారు. సింగరేణి ప్రైవేటీకరణ ప్రచారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు నేను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి లేఖ రాశానని స్పష్టం చేశారు. నా లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు సింగరేణి విషయంలో స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు.
సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని, అది అసాధ్యం కూడా అని కేంద్రమంత్రి తేల్చారని బండి స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో అత్యధికంగా 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కేంద్ర వాటా 49 శాతం మాత్రమేనని చెప్పారు. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడం అసాధ్యమని, ఆ మాటే ఉత్పన్నం కాదని తేల్చేశారని సంజయ్ వెల్లడించారు. కోల్ బ్లాక్ వేలం విషయానికి వచ్చినప్పుడు మైన్స్ అండ్ మినరల్ డెవలప్ మెంట్ రెగ్యులేషన్ యాక్ట్-2015 ప్రకారం పారదర్శకంగా వేలం వేయాలని చట్టం చేశారని చెప్పారు. ఈ చట్టం ప్రకారం…. 1. యాక్షన్ వేలం ద్వారా 2 అలైన్ మెంట్ ద్వారా కేటాయించాలనే నిబంధన ఉందని, ఈ పద్దతి ప్రకారం రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుందని కేంద్ర మంత్రి తెలిపారని ఆయన వెల్లడించారు.
అయితే 2020లో కమర్షియల్ మైనింగ్ అనే అంశాన్ని చట్టంలో చేర్చడం వల్ల నాటి నుండి వేలం ద్వారా మాత్రమే బొగ్గు బ్లాకులు కేటాయిస్తున్నారని బండి సంజయ్ గుర్తు చేశారు. సింగరేణి ప్రాంతానికి చెందిన 4 బ్లాకులను వేలం వేస్తే ఎవరూ బిడ్లు వేయలేదని చెప్పారు. ఈ బ్లాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే వేలం ద్వారా సింగరేణి సంస్థ పొందవచ్చని వెల్లడించారు. ఇప్పటికే సింగరేణి 3 బ్లాకులను ఈ చట్టం ద్వారా పొందిందని చెప్పారు. అందులో ఒడిశా రాష్ట్రంలోని నైనికోల్ బ్లాక్, పెనగడప-తెలంగాణ, నూ పాత్రపద(ఒడిశా)ను సింగరేణి తీసుకుందని కూడా కేంద్ర మంత్రి తెలిపారు.
కాబట్టి సింగరేణి ప్రాంత ప్రజలు, కార్మికులకు తన విజ్ఞప్తి ఒక్కటేనని…. సింగరేణిని ప్రైవేటీకరించబోతున్నారని చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. సింగరేణికి చెందిన ప్రస్తుతమున్న బొగ్గు గనుల నిక్షేపాలు మరో 100 సంవత్సరాల పైచిలుకు ఉంటాయన్నారు. బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నేతలు ఈ వాస్తవాలను అర్ధం చేసుకోవాలని….ఇకనైనా కళ్లు తెరుచుకుని వాస్తవాలు మాట్లాడాలని కోరుతున్నానని బండి సంజయ్ కోరారు.