తెలంగాణ‌ను ఆంధ్ర‌లో క‌లుపుత‌రు..

-మా ప‌ట్ల ఇంత వివ‌క్ష‌, విద్వేషం ఎందుకు..?
-ఈ బీజేపీ మ‌న‌కు అవ‌స‌ర‌మా...?
-నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్

దేశంలోని రైల్వేలు, ఎయిరిండియా, జీవిత బీమా లాంటి అనేక సంస్థ‌ల‌ను మోదీ అమ్మేస్తుండు.. మీరు ఓ నాలుగు రోజులు అవ‌కాశం ఇస్తే తెలంగాణ‌ను తీసుకుపోయి మ‌ళ్లీ ఆంధ్రాలో క‌లిపేస్తడని కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన మంత్రి కేటీఆర్.. రూ. 120 కోట్ల వ్య‌యంతో నిర్మించే సిద్ధాపూర్ రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం సిద్దాపూర్ గ్రామంలో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. బీజేపీ నాయ‌కుల లొల్లికి పొర‌పాటున యువ‌త ఆగ‌మైతే మ‌ళ్లీ తెలంగాణ‌ను, ఆంధ్రాను క‌లుపుత‌రు ఈ పుణ్యాత్ములు. అంత దారుణ‌మైన మ‌న‌షులు వీళ్లు. కేంద్రం స‌హ‌క‌రించినా, స‌హ‌క‌రించ‌క‌పోయినా తెలంగాణ అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతోంద‌ని కేటీఆర్ అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ రాజ‌కీయాలు, కుల‌మ‌తాల‌కు అతీతంగా ప్ర‌జ‌ల‌ను ప్ర‌జ‌లుగా చూస్తుంద‌ని కేటీఆర్ అన్నారు. మ‌తం ఏదైతేనేమి.. ర‌క్తం ఒక్క‌టే క‌దా? బీజేపీ నాయ‌కులు ముస్లింల మీద విషం చిమ్మ‌డం ప‌నిగా పెట్టుకున్నారు. తెల్లారిలేస్తే విషం నింపుడు, ద్వేష ప్ర‌చారం చేస్తున్నారు. మ‌న‌సు, శ‌రీరం నిండా విషం త‌ప్ప‌, విష‌యం లేదన్నారు. ఏడున్న‌రేండ్ల‌లో మోదీ తెలంగాణ‌కు ఏం ఇవ్వ‌లేదని దుయ్య‌బ‌ట్టారు. 157 మెడిక‌ల్ కాలేజీలు మంజూరైతే.. తెలంగాణ‌కు గుండు సున్నా. 87న‌వోద‌య పాఠ‌శాల‌లు మంజూరు చేస్తే.. తెలంగాణ‌కు గుండు సున్నా. కొత్తగా 8 ఐఐఎంలు మంజూరైతే తెలంగాణ‌కు గుండు సున్నా. ఇందుకేనా మా కార్ల‌కు బీజేపీ కార్య‌క‌ర్త‌లు అడ్డం వ‌చ్చేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత మెడిక‌ల్ కాలేజీలు, గురుకుల పాఠ‌శాల‌లు మంజూరు చేశామ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఆగ‌మాగం అవొద్దు.. ఆలోచ‌న‌తో ఉండాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. తెలంగాణ‌కు ఏం చేశారో చెప్పాల‌ని బీజేపీ నాయ‌కుల‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు.

తెలంగాణ కోసం అనేక పోరాటాలు, ఉద్య‌మాలు చేసి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. అలాంటి తెలంగాణ పుట్టుక‌ను మోదీ ప్ర‌శ్నిస్తున్నారు. అన్యాయంగా త‌లుపులు బంద్ పెట్టి తెలంగాణ‌ను ఇచ్చారని మోదీ అంటున్నారు. క‌ర్ణాట‌క‌లోని అప్ప‌ర్ భ‌ద్ర‌కు జాతీయ హోదా ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా ఇవ్వ‌రు. మా ప‌ట్ల ఇంత క‌క్ష‌, వివ‌క్ష ఎందుకు? తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా? తెలంగాణ పుట్టుక‌నే ప్ర‌శ్నించిన పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్ట‌గ‌తులు ఉండాల్నా.. త‌రిమికొట్టాల్నాఅనేది ఆలోచించాల‌ని కోరుతున్నానని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో పుట్టిన బీజేపీ నాయ‌కుల‌కు ఏ రోగం వ‌చ్చింది. ఎంత‌సేపు మోదీ భ‌జ‌న చేయ‌డ‌మేనా? మోదీని నిల‌దీసే ప్ర‌య‌త్నం చేయ‌రా? అన్నారు. యూపీకి, ఉత్త‌ర భార‌త్‌కే మోదీ ప్ర‌ధాని మంత్రి. తెలంగాణ‌కు ఒక్క ప‌ని కూడా చేయ‌రు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like