తెలంగాణకు 19 జాతీయ అవార్డులు..

తెలంగాణ‌కు ఏకంగా 19 జాతీయ అవార్డులు ద‌క్కాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఇందులో జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు వివిధ కేటగిరీల్లో 19 అవార్డులు దక్కాయి.

వనపర్తి జిల్లాలోని చందాపూర్‌కు చైల్డ్‌ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు రాగా, సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలంలోని ఎర్రవల్లికి గ్రామ పంచాయతీ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ అవార్డు, నారాయణపూర్‌ జిల్లా మక్తల్‌ మండలంలోని మంథన్‌గోడ్‌ గ్రామ పంచాయతీకి నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ పురస్కార్‌కు ఎంపిక చేసినట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ పంచాయతీ స్వశక్తికరణ్‌ పురస్కారాలను రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రకటించారు. పెద్దపల్లి, తిరుమలగిరి (సూర్యాపేట), పర్వతగిరి (వరంగల్‌ ), కోడిమ్యాల్‌ (జగిత్యాల), ఇచ్చోడ మండలంలోని ముక్రా (ఆదిలాబాద్‌), రామడుగు మండలంలోని వెలిజాల (కరీంనగర్‌), తొర్రూర్‌లోని వెంకటాపురం (మహబూబాబాద్‌), నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్‌ (సిద్దిపేట), రాజాపూర్‌లోని గుండ్లపోచంపల్లి (మహబూబ్‌నగర్‌), మద్దికుంట (రాజన్నసిరిసిల్ల), నాగారం (మంథని, పెద్దపల్లి), గీసుకొండలోని మరియాపురం (వరంగల్‌), హరిపురం(పెద్దపల్లి), మందేపల్లి (రాజన్న సిరిసిల్ల), బూరుగుపల్లి (సిద్దిపేట)కు అవార్డులు దక్కాయి.

తెలంగాణకు 19 అవార్డులు అవార్డులు రావడం పట్ల పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టి, సాధించిన అభివృద్ధి, విజన్‌ కారణంగానే ఈ అవార్డులు దక్కాయని చెప్పుకొచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like