భార్య శవాన్ని తీసుకువస్తున్న భర్త మృతి
Road Accident: భార్య శవాన్ని తీసుకువస్తున్న భర్త కూడా మృత్యువాత పడ్డాడు. ఒకే రోజులో ఇద్దరు తల్లిదండ్రులు చనిపోవడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన విషాధఘటన వివరాలిలా ఉన్నాయి. లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన మల్లికార్జున్ రావు (31), శరణ్య (29) భార్యాభర్తలు. పొరుగింటి వారితో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన శరణ్య ఈనెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శరణ్య శనివారం మృతి చెందింది.
మల్లికార్జున్ శరణ్య మృతదేహాన్ని ఆదివారం అంబులెన్స్లో స్వగ్రామానికి తరలిస్తున్నాడు. తాను కూడా అంబులెన్స్ వెంట బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే లక్షెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తా వద్ద మల్లికార్జున్ రావు బైక్ను వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మల్లికార్జున్ అక్కడికక్కడే మృతిచెందారు. ఒక్కరోజులోనే దంపతులిద్దరూ మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవటంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.