3 కోట్ల 17 లక్షల 17 వేల 389
-తెలంగాణలో ఓటర్ల తుది జాబితా
-ప్రక్షాళనలో 22 లక్షల ఓట్లు తొలగింపు
![](https://naandinews.com/wp-content/uploads/2023/10/00000010101010-750x430.jpg)
Election Commission: తెలంగాణలో రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలోనే.. ఎన్నికల సంఘం తెలంగాణ ఓటర్ల జాబితాను ప్రకటించింది. మన రాష్ట్రంలో మూడు కోట్ల 17 లక్షల 17 వేల 389 ఓటర్లున్నట్టు ప్రకటించిన ఈసీ.. ప్రక్షాళనలో 22 లక్షల ఓట్లను తొలగించింది.
తెలంగాణలో ఎన్నికల హడావుడి జోరందుకుంది. రాష్ట్రంలోని ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 ఓట్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రక్షాళన అనంతరం ఈ ఓట్ల జాబితా విడుదల చేసింది. ప్రక్షాళనలో ఏకంగా.. 22 లక్షల 2168 ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. మరణించిన వాళ్లు, డూప్లికేట్ ఓట్లు, సరైన ధ్రువపత్రాలు లేకపోవటం ఇలా పలు కారణాల దృష్ట్యా.. ఓట్లు తొలిగించినట్టు అధికారులు చెప్తున్నారు.
తెలంగాణలో ఉన్న మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు కోటీ 58 లక్షల 43 వేల 339 (1,58,43,339) మంది ఉండగా.. పురుష ఓటర్లు కోటి 58 లక్షల 71 వేల 493 (1,58,71,493) మంది ఉన్నారు. ఇక.. మొత్తం ఓటర్లలో ట్రాన్స్జెండర్ల సంఖ్య 2,557 మందిగా ఉన్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. జాబితాలో సర్వీస్ ఓటర్లు 15,338 మంది, ఓవర్సీస్ ఓటర్లు 2,780 మంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.